
సూసైడ్ నోట్ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయిన భార్య
మేదరమెట్ల: సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్యను పోలీసులు అత్యంత వేగంగా వెదికి తిరిగి భర్తకు అప్పగించిన ఘటన శనివారం మేదరమెట్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేదరమెట్ల గ్రామానికి చెందిన వెల్లంకి వెంకట కీర్తి తనకున్న అనారోగ్య సమస్యల వల్ల సూసైడ్ నోట్ రాసి ఈనెల 23వ తేదీ సాయంత్రం ఇంట్లో ఉంచింది. తన ఫోన్ను కూడా ఇంట్లోనే పెట్టి వాకింగ్కు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లింది. ఎంతకీ రాకపోడంతో కుటుంబ సభ్యులు ఆ లేఖ గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శనివారం చీరాల, కొత్తపట్నం, చిన్నగంజాం సముద్ర తీరాలకు వెళ్లి వెతుకుతుండగా వెంకటకీర్తి కొత్తపట్నం సముద్రతీరం వద్ద కనిపించింది. ఆమెను ఎంతో చాకచక్యంగా పట్టుకొని మేదరమెట్ల పోలీసు స్టేషన్కు తీసుకు వచ్చి ఆమె భర్త నిఖిల్కు అప్పగించారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని తక్కువ సమయంలోనే పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
కొత్తపట్నం సముద్రతీరం వద్ద కనుగొని భర్తకు అప్పగించిన పోలీసులు