సంతమాగులూరు (అద్దంకి): ప్రభుత్వం మిర్చికి మద్దతు ధర రూ.21 వేలు ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన బుధవారం సంతమాగులూరు మండలంలోని సంతమాగులూరు అడ్డరోడ్డు , ఏల్చూరు, కొమ్మాలపాడు గ్రామాల్లోని మిర్చి చేలను పరిశీలించారు. కల్లాల్లోని మిరపకాయలను చూసి, రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఒక ఎకరంలో సాగుకు రూ.2.52 లక్షలు వ్యయం అయిందని రైతులు సీహెచ్ హనుమంతరావు, ఎ. నాగేశ్వరరావు, రామకృష్ణ, ఎస్కే ఖాదర్ చెప్పారు. ఎంతో శ్రమించి పండించినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా ధర మాత్రం క్వింటాకు రూ.10 వేలలోపే ఉందని వాపోయారు. జమలయ్య మాట్లాడుతూ క్వింటాకి రూ.21 వేలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.11,781గా ప్రకటించడం దుర్మార్గమన్నారు. మూడు నెలల నుంచి కాలయాపన చేసి క్వింటా మిర్చి కూడా కొనుగోలు చేయలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం సుమారు ఐదు లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారని చెప్పారు. దళారులు, వ్యాపారులు కుమ్మకై ్క రైతులను దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చోద్యం చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం
ఒకవైపు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. వారికి ఏదో మేలు చేయబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడటం హాస్యాస్పందంగా ఉందని రైతులు పేర్కొన్నారు. ధరల వ్యత్యాస పథకం కింద ఆదుకుంటామని చెప్పి ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నేరుగా రైతుల నుంచి మిర్చిని క్వింటా రూ.21 వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైన ప్రాంతాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా సీపీఐ కార్యదర్శి సింగరకొండ, వ్యయసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అద్దంకి నాగేశ్వరరావు, కౌలు రైతుల సంఘం నాయకులు ఎస్కే ఖాదర్ బాషా, చెన్నుబోయిన హనమంతరావు, రామకృష్ణ, మేకల రమణయ్య, ఆవుల యలమందయ్య పాల్గొన్నారు.