నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : మద్యం మత్తులో ఓ యువకుడు ఎలుకల నివారణ మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం నిమ్మనపల్లె మండలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి మృతుడి కుటుంబీకులు, నిమ్మనపల్లె పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని రాచవీటివారిపల్లె పంచాయతీ గుండ్లబురుజుకు చెందిన శివయ్య, విజయమ్మ దంపతుల కుమారుడు కుమార్ ఆచారి (20) మంగళవారం ఉదయం మద్యం మత్తులో ఇంట్లో ఉన్న ఎలుకల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని హుటా హుటిన మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్లు వెంటనే తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. కుటుంబీకులు 108 వాహనంలో రుయా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోని చిన్నగొట్టిగల్లు వద్దకు వెళ్లగానే మృతి చెందాడు. ఏడాది క్రితం భర్త చనిపోడం ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటాడు అనుకున్న పెద్ద కొడుకు జులాయిగా తిరుగుతూ.. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో తరచూ మద్యం తాగటం అలవాటు పడి, ఇలా అర్ధాంతరంగా చనిపోయి కడుపుకోత మిగల్చడంతో తల్లీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆత్మహత్యపై నిమ్మనపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


