రెక్కాడితే డొక్కాడని బతుకులు వారివి..రోజూ కూలిపనికి వెళ్తేనే నాలుగు వేళ్లూ నోట్లోకి వెళతాయి. వారి కుటుంబ జీవనం గడుస్తుంది. అలాంటి వారిపై విధి చిన్నచూపు చూసింది.రోడ్డుప్రమాద రూపంలో తొమ్మిదిమందిని బలి తీసుకుంది. పలువురిని ఆసుపత్రిపాలు చేసింది.వారిని నమ్ముకున్న కుటుంబాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ‘ఎంతపని చేశావు దేవుడా’ అంటూ వారు గుండెలవిసేలా రోదించారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయామంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సాక్షి రాయచోటి/ ఓబులవారిపల్లె/ పుల్లంపేట/ రాజంపేట : రాజంపేట ఇసుకపల్లి గ్రామం నుంచి మామిడికాయలు తీసుకు వెళ్తున్న ఐచర్ వాహనం రెడ్డిపల్లి చెరువు కట్టపై బోల్తా కొట్టడంతో 9 మంది కూలీలు మృతిచెందారు. స్థానికుల కథనం మేరకు శెట్టిగుంట ఎస్టీ కాలనీ గ్రామానికి చెందిన దాదాపు 22 మంది కూలీలు ఆదివారం ఐచర్ వాహనంలో మామిడికాయలు కోతకు రాజంపేట మండలంలోని మందరం వెళ్లారు. సాయంత్రం మామిడికాయలు లోడ్ చేసుకొని తిరుగు ప్రయాణంలో లారీపై ఎక్కి కూర్చున్నారు. లారీ రెడ్డి పల్లి చెరువు కట్ట సమీపానికి రాగానే ఎదురుగా వెళుతున్న వాహనాన్ని అధిగమించబోయి అదుపు చేయలేక బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు.మరొకరు మార్గమధ్యలో మృతి చెందారు. 13మంది గాయపడ్డారు. బోల్తా పడిన లారీని అతి కష్టం మీద క్రేన్ సాయంతో పోలీసులు పక్కకు తీశారు.గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఎన్ వెంకటేశు, జి.పోలమ్మ, పి. రామయ్య, జి.శ్రీనివాసులు, పి.వెంకటేశు, వి.విజయలక్ష్మి, వి.గంగోత్రి ఉన్నారు.వీరికి చికిత్స అందజేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెంటెంట్ డాక్టర్ పీవీఎన్ రాజు తెలిపారు.మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.
మృతి చెందిన వారు : గజ్జల దుర్గయ్య, సుబ్బరత్నమ్మ, గజ్జల వెంకటేశు,గజ్జల శీను, చిట్టెమ్మ, గజ్జల లక్ష్మీదేవి,రాధ, గజ్జల రమణ, వెంకట సుబ్బమ్మ.
శెట్టిగుంట ఎస్టీ కాలనీలో విషాదం
శెట్టిగుంట ఎస్టీ కాలనీలో విషాదం అలుముకుంది. కూలికిపోయీన వారిపై విధి చిన్నచూపు చూడటంతో ఒకేసారి ఇంతమంది చనిపోవడం ఈ ప్రాంతంలో ఇదే ప్రథమం.కూలి కోసం పగలంతా కష్టపడి రాత్రికి ఇంటికి వస్తున్నవారిపై అనుకోని ప్రమాదం ప్రాణాలను తీసింది. ఇందులో 9మంది చనిపోవడంతోపాటు పలువురు గాయపడటంతో కాలనీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాదం అలుముకుంది.
పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నారులు
ఊహించని ప్రమాదంతో కూలీలు అల్లకల్లోలమయ్యారు. ఆదివారం కావడం. అందునా ఇంటి దగ్గర ఉంటే ఆలనాపాలనా ఎవరు చూస్తారో తెలియక తమతో పాటు పిల్లలను వెంట తీసుకెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మామిడి కాయలను లారీలో లోడ్ చేసుకొని వస్తున్న సమయంలో పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువు కట్ట వద్ద ప్రమాదం సంభవించింది. లారీపైన కూర్చొని ప్రయాణిస్తున్న వారిలో తొమ్మిది మంది మృత్యువాత పడగా మరో 13 మందికి గాయాలయ్యాయి. అయితే క్యాబిన్ లోపల ఉన్న ఇద్దరు చిన్నారులు గంగోత్రి,చంచిత ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ బోల్తా పడటంతో చిన్నారులు బోరున విలపించారు. పెద్ద ప్రమాదంలో చిన్నారులు బయటపడటం దేవుడి దయేనంటూ పలువురు పేర్కొంటున్నారు.
రెడ్డిపల్లె చెరువు కట్ట వద్ద లారీ బోల్తా
9 మంది కూలీల మృతి
13మందికి గాయాలు
మృతుల కుటుంబాలకు తీరని శోకం
కూలిన బతుకులు
కూలిన బతుకులు
కూలిన బతుకులు
కూలిన బతుకులు
కూలిన బతుకులు
కూలిన బతుకులు
కూలిన బతుకులు