
అతిగారిపల్లిలో వినాయక విగ్రహం అపహరణ
పెనగలూరు : మండలంలోని అతిగారిపల్లి బీసీ కాలనీ వద్ద పురాతన కాలం నాటి వినాయక విగ్రహాన్ని సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు గ్రామస్తులు తెలిపారు. బీసీ కాలనీ ఇంగ్లీషు మీడియం స్కూల్ మధ్యలో ఈ వినాయక విగ్రహం పురాతన కాలం నాటిదన్నారు. రోజూ భక్తులు అక్కడ పూజలు చేసేవారని తెలిపారు. త్వరలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చందాలు కూడా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ తరుణంలో రాత్రి వేళలో విగ్రహాన్ని అపహరించారు. ఈ విగ్రహాన్ని జడవారిపల్లి రూటు వరకు ఈడ్చుకొని వెళ్లి అక్కడి నుంచి వాహనంలో తీసుకెళ్లినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ విగ్రహం చోరీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.
మహిళ ఆత్మహత్య
సిద్దవటం : మండలంలోని మాధరవం–1 గ్రామ పంచాయతీ వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన నందం జయలక్ష్మి(27) అనే మహిళ మంగళవారం ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త నరసింహులు మాట్లాడుతూ తన భార్యకు మతిస్థిమితం లేదని కడప, తిరుపతి వైద్యశాలలో వైద్యం చేయించామన్నారు. తనకు ఐదేళ్ల కుమారుడు పెంచల్రామ్ ఉన్నాడని, ఈ అబ్బాయి తల్లిలేని బిడ్డగా మిగిలిపోయాడని బోరున విలపించాడు. ఈ విషయమై ఎస్ఐ మహమ్మద్రఫీ మాట్లాడుతూ మృతురాలి తండ్రి సుబ్రమణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

అతిగారిపల్లిలో వినాయక విగ్రహం అపహరణ