
రెండు బైకులు ఢీ
ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని కడప–చైన్నె జాతీయ రహదారిలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల క నం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా, మంత్రాలయం నుండి కడప వైపు వెళ్తున్న ఏపీ40హెచ్5631 నెంబరుగల బైకు ఒంటిమిట్టలోని కోదండరామస్వామి కల్యాణ వేదిక మొదటి గేటు వద్ద ఉన్న కడప–చైన్నె జాతీయ రహదారి దగ్గరకు రాగానే కల్యాణ వేదిక ఎదురుగా పంచర్ షాపు నుండి ఏపీ 40బిఒ6680 నెంబరుగల బైకు అకస్మాత్తుగా రావడంతో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మంత్రాలయానికి చెందిన సంపత్, ప్రకాష్ (24) అనే ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని అదే వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. అక్కడ గాయపడిన వారిలో సంపత్ రిమ్స్ నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడని, కానీ అక్కడ ఉన్న ప్రకాష్ పరిస్థితి కాస్త విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
కుటుంబ సమస్యలతో
ఇద్దరి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో కుటుంబ సమస్యల కారణంగా ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన బాలాజీ భా ర్య శ్రీదేవి (28) కుటుంబ సమస్యల కారణంగా విషద్రావణం తాగింది. ఆమె భర్త మూడేళ్ల క్రితం మృతి చెందగా ఇద్దరు పిల్లలతో కలిసి అత్తవారి ఇంట్లో ఉంటోంది. అత్తతో మనస్పర్థలు ఏర్పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మదనపల్లె మండలం తట్టివారిపల్లె పంచాయతీ గోవర్థన్ నగర్కు చెందిన నాయక్ భార్య లక్ష్మి (30) కుటుంబ సమస్యల కారణంగా సోమవారం రాత్రి ఇంట్లోనే ఉరివేసుకుంది. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీదేవిని తిరుపతికి రెఫర్ చేయగా, లక్ష్మిని కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సృజన ఆత్మహత్యకు
కారణాలు వెల్లడించాలి
రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణ పరిధిలోని మిట్టవాండ్లపల్లెకు చెందిన సృజన ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు వెల్లడించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు, మంగళవారం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రామాంజులు, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.