
ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరచడం తగదు
కడప సెవెన్రోడ్స్ : ప్రభుత్వ రంగ సంస్థలను, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జూలై 9న దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం కడప డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం డివిజన్ అధ్యక్షుడు అవధానం శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక డివిజనల్ కార్యాలయం ఎదుట దేశవ్యాప్త పిలుపు మేరకు జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో బీమా చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారని, దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఎల్ఐసీలో ప్రభుత్వం తన వాటాలను ఉపసంహరించుకునే కార్యక్రమం మరోమారు చేపట్టనుందని, దీనిని ప్రతిఘటిస్తున్నామన్నారు. బీమా ప్రీమియంలపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని తగ్గించాలని ఆయన కోరారు. 3,4 తరగతుల సిబ్బంది కోసం రిక్రూట్మెంట్ తక్షణం చేపట్టాలన్నారు. దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెన్షన్ విధానానికి స్వస్తి పలికి పాత పెన్షన్ విధానాన్ని అమలుకు సిద్ధపడుతున్నాయని, ఎల్ఐసీలో కూడా అందరికీ పాత పెన్షన్ విధానమే అమలు చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నేతలు వసుప్రద, వారిజాతమ్మ, కేసీఎస్ రాజు, అమీనా పర్వీన్, రత్న కిషోర్, శ్రీవాణి, శశికళ, కుమార్, రఘు, చిన్నయ్య, గౌస్, హనుమ తదితరులు పాల్గొన్నారు.
జులై 9న దేశవ్యాప్త సమ్మెను
జయప్రదం చేద్దాం
నిరసన ప్రదర్శనలో ఎల్ఐసీ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి