
నిలిచిన నిధులు..ఆగిన పనులు
రాయచోటి: నేతి బీరకాయలో నెయ్యి ఉండదన్న చందంగా కూటమి పాలనలో గ్రామీణ పాలన సాగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. పల్లె సీమల అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు కూడా నీటి మూటలయ్యాయి. కూటమి సర్కార్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాలకు చేరలేదు. దీంతో అభివృద్ధి కుంటుబడింది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు జనాభా ప్రాతిపదికన కేంద్రం ఏటా ఆర్థిక సంఘం రెండు విడతలుగా నిధులు మంజూరు చేస్తుంది. టైడ్, బేసిక్ నిధుల రూపంలో విడుదల చేసే వీటిని ఆర్థిక సంఘం నిబంధనల మేరకు స్థానిక సంస్థలు వినియోగించాలి. బేసిక్ గ్రాంట్ను గ్రామాల్లో సీపీ రోడ్లు, డ్రెయిన్లు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశాన వాటిక అభివృద్ధి, వీధిలైట్ల నిర్వహణ తదితర వాటికి వ్యయం చేయాల్సి ఉంది. టైడ్ గ్రాంటును పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ఓడీఎఫ్ అమలు తదితర ప్రాథమిక అవసరాలకు ఖర్చు చేయాలి. కేంద్రం నుంచి ఈ నిధులు తొలుత రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతాయి. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిబంధనల మేరకు పంచాయతీలకు జమ చేస్తుంది.
నెలలు గడుస్తున్నా ..
జిల్లాలో 30 మండలాల్లో 501 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నుంచి దాదాపు రూ. 28 కోట్ల మేర కేంద్రం కేటాయింపు చేసింది. తొలి విడతగా రూ. 7.88 కోట్లను అక్టోబర్ నెలలో విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో సుమారు రూ. 20.78 కోట్లను 15వ ఫైనాన్స్ కమిషన్ జిల్లాకు కేటాయించింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసిపోయినా నెలల తరబడి ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది.
మండలాల వారీగా మంజూరైన నిధులు...
బి కొత్తకోట రూ. 4.41 లక్షలు, చిన్నమండెం రూ. 3.64 లక్షలు, చిట్వేలి రూ. 6.09 లక్షలు, గాలివీడు రూ. 9.74 లక్షలు, గుర్రంకొండ రూ. 4.32 లక్షలు, కలకడ రూ. 4.13 లక్షలు, కలికిరి రూ. 9.38 లక్షలు, కుంభంవారిపల్లి రూ. 7.36 లక్షలు,కోడూరు రూ. 15.14 లక్షలు, కురబల కోట రూ. 5.73 లక్షలు, లక్కిరెడ్డిపల్లి రూ. 5.57 లక్షలు, మదనపల్లి రూ. 6.39 లక్షలు, ములకల చెరువు రూ. 7.70 లక్షలు, నందలూరు. రూ. 6.10 లక్షలు, నిమ్మనపల్లి రూ. 5.38 లక్షలు, ఓబులవారిపల్లి రూ. 9.63 లక్షలు, పెద్దమండెం రూ. 6.12 లక్షలు, పెనగలూరు రూ. 1.16 కోట్లు, పీలేరు రూ. 7.35 లక్షలు, పిటీఎం రూ. 80.26 లక్షలు, పుల్లంపేట రూ. 56.89 లక్షలు, రాజంపేట రూ. 1.18 కోట్లు, రామాపురం రూ. 60.15 లక్షలు, రామసముద్రం రూ. 69.42 లక్షలు, రాయచోటి రూ. 50.95 లక్షలు, సంబేపల్లి రూ. 44.53 లక్షలు, టి సుండుపల్లి రూ. 64.16 లక్షలు, తంబళ్లపల్లి రూ. 72.29 లక్షలు, వాల్మీకిపురం రూ. 58 లక్షలు, వీరబల్లి రూ. 59.22 లక్షలు.
పడకేసిన ప్రగతి...
కూటమి సర్కార్ నిర్వాకం
జమ కాని 15వ ఆర్థిక సంఘం నిధులు
రెండు నెలలు కిందటే జిల్లాకు రూ. 20.78 కోట్లు విడుదల చేసిన కేంద్రం
పంచాయతీలకు అందక కుంటుపడిన అభివృద్ధి
నిధుల విడుదలలో జాప్యం కావడంతో గ్రామాల్లో జరగాల్సిన అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇంటి పన్నులపై వచ్చే ఆదాయం సిబ్బంది జీతభత్యాలు, పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణకు కూడా చాలని పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్భాటంగా సీసీ రోడ్ల నిర్మాణాలకు బిల్లులు ఇవ్వకపోవడంతో మిగిలిన పనులు మధ్యలో ఆగిపోయాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా గ్రామాల్లో నిధులు రావన్న ఉద్దేశంతో సిమెంట్ రోడ్ల నిర్మాణం ఆగిపోవడంతో స్థానికులు అదే రోడ్లపై ప్రయాణం సాగిస్తున్నారు. డ్రైజీనే వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. నిధుల కొరతతో అనేక గ్రామాల్లో వీధి లైట్లు వెలగడం లేదు. పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి నిధుల కొరత వేధిస్తోందని సర్పంచ్లు వాపోతున్నారు. రెండో విడత నిధులు మండలాలవారీగా కేటాయింపులు జరిగాయని, త్వరలోనే విడుదల కావాల్సి ఉందని జిల్లా పంచాయతీ అధికారిణి రాధిక తెలిపారు.గ్రామాల అభివృద్ధి కోసం ఏవేవో చేస్తామంటూ ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి, ఉపన్యాసాలు చేసిన నాయకుల కళ్లెదుటే నిధులు దారి మళ్లిపోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. 15వ ఫైనాన్స్ రెండో విడత నిధులను పంచాయతీలు కేటాయించి ఆయా ప్రాంతాల అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.