
రెడ్డెమ్మతల్లీ.. కరుణించమ్మా..
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన రెడ్డెమ్మతల్లి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రెడ్డెమ్మతల్లీ కరుణించమ్మా అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా అమ్మవారికి వేకువజామునే నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు జరిపారు. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా పేరుపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.కొందరు భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లీమ్లు పెద్ద ఎత్తున ఆలయానికి తరలిరావడం విశేషం.
ప్రశాంతంగా బదిలీ ప్రక్రియ
కడప ఎడ్యుకేషన్: కడపలోని డీఈఓ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన 1998,2008 డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ప్రశాతంగా జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 901 ఖాళీలను ప్రదర్శించగా జిల్లాలో ఉన్న ఎంటీఎస్ ఉపాధ్యాయులు తమకు సంబంధించిన స్థానాలకు కోరుకుని బదిలీపై వెళ్లారు. జిల్లావ్యాప్తంగా 206 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులకుగాను 201 మంది బదిలీ కౌన్సిలింగ్కు హాజరయ్యారు. మిగతా ఐదు మంది అభ్యర్థులకు బదిలీ కౌన్సెలింగ్కు గైర్హాజరయ్యారు.