
5న భారీ ప్లాంటేషన్ గ్రీన్ డ్రైవ్
రాజంపేట : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 5న భారీ ప్లాంటేషన్ గ్రీన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా అటవీశాఖాధికారి జగన్నాథసింగ్ తెలిపారు. సోమవారం తన చాంబరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 28 విభాగాలతో జిల్లా వ్యాప్తంగా ప్లాంటేషన్ డ్రైవ్ చేస్తామన్నారు. జిల్లాలో 50 శాతం పచ్చదనం సాధించాలనే ప్రధాన లక్ష్యంతో అటవీశాఖ, వివిధ శాఖల భాగస్వామ్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అంతటా 4.5 లక్షల మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. రాజంపేట–రాయచోటి రహదారిలోని ఎస్ఆర్పాళెం నగరవనంలో జిల్లా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఎర్రచందనం, వేప, టేకు, నేరెడు, ఉసిరి, వెదురు, చింత, దానిమ్మ, ఎగసి, గంగరావి, మారేడు, సీతాఫలం, తాండ్ర, శ్రీగంధం, తెల్లమది, మునసంపెంగా, బహునీయతో పాటు మరికొన్ని మొక్కలను నాటుతామన్నారు. ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజలు స్వరాన్ని వినిపించాలని.. అన్నమయ్య హరిత విప్లవంలో భాగం కావాలని ఆయన కోరారు.
జిల్లా అటవీ అధికారి జగన్నాథ సింగ్