
చంద్రబాబుకు బుద్ధి చెప్పండి
కురబలకోట : సీఎం పదవి కోసం కాళ్లు కడిగి కన్యాదానం చేసిన సొంత మామ ఎన్టీఆర్ను నాడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.. ఆపై మామ పార్టీని నిర్దాక్షిణ్యంగా లాక్కున్నారు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయక నేడు మరోసారి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.. రాష్ట్ర సీఎం వైఖరిని నిరసిస్తూ బుధవారం చేపట్టిన వెన్నుపోటు దినంలో వైఎస్సార్ సీపీ పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాలు, అభిమానులతోపాటు ప్రజలు భాగస్వామ్యులు కావాలని ఆ పార్టీ రాష్ట్ర కీలక నాయకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కనసానివారిపల్లె గ్రామ సర్పంచ్ ఆర్కే కృష్ణారెడ్డి గృహం వద్ద నియోజక వర్గ నాయకులు వారికి మంగళవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి ఇచ్చిన హామీలను అటకెక్కించి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసించాలన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం వెన్నుపోటుతో కూడుకున్నదన్నారు. చంద్రబాబు మోసాలకు, వెన్నుపోటుకు పేటెంట్ లాంటి వాడన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఏడాది కావస్తున్నా ఇంత వరకు ఒక్క కొత్త దివ్యాంగుల ఫించన్గాని, వృద్ధాప్య ఫించన్ గాని ఇచ్చిన పాపాన పోలేదన్నారు. భర్తను కోల్పోయిన ఎందరో వితంతువులు ఫించన్ కోసం ఎదురు చూస్తున్నా ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఆపై సూపర్ సిక్స్ పథకాలకు దిక్కులేదన్నారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి మాయ మాటలతో కాలం వెల్లదీస్తున్న ఇంత అధ్వాన్న ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగింది ..జరిగింది శూన్యమన్నారు. వెన్నుపోటు అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే వెన్నుపోటు గుర్తుకు వస్తాయన్నారు. ప్రజా స్వామ్య పద్ధతిలో ఈ నిరసన చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని దగా చేసిన కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వెన్నుపోటు దినంను విజయ వంతం చేసి కూటమి ప్రభుత్వ కళ్లు తెరిపించాలని కోరారు.
సూపర్ సిక్స్కు దిక్కులేదు
కూటమి ప్రభుత్వ మోసాలను
ఎండగట్టండి
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పిలుపు

చంద్రబాబుకు బుద్ధి చెప్పండి