పోట్లదుర్తిలో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

పోట్లదుర్తిలో ఉద్రిక్తత

Jun 3 2025 5:51 AM | Updated on Jun 3 2025 5:53 AM

జమ్మలమడుగు : ఎర్రగుంట్ల మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయ ప్రహరీ నిర్మాణ పనులకు సంబంధించి సోమవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా ఎర్రగుంట్ల సీఐ నరేష్‌బాబు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోట్లదుర్తి గ్రామానికి చెందిన అనాకపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ నాయుడు తన కోటా కింద గ్రామంలోని పెద్దమ్మ ఆలయ ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. పనులు చేపట్టేందుకు ప్రస్తుతం పూనుకున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయానికి సంబంధించి 3.09 ఎకరాల భూమి ఉందని, అందులో కొంత భూమిని ఆక్రమణదారులు కబ్జా చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై గ్రామస్తులు దేవాదాయశాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు గతంలో ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టును ఆశ్రయించారు. ఆలయానికి సంబంధించిన మొత్తం స్థలంలో ఆక్రమణలను తొలగించిన తర్వాతే అభివృద్ధి పనులు ప్రారంభించాలని కోరారు. ఆలయ పరిరక్షణ కోసమే ప్రస్తుతం ఉన్న స్థలంలో ప్రహరీ నిర్మాణ పనులు చేపడుతున్నామని ఎంపీ సోదరుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సీఎం రమేష్‌ నాయుడు సంఘటన స్థలానికి వచ్చి చెప్పారు. ప్రహరీ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురేష్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహింపజేయడంతోపాటు వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేసి ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నామని తెలిపారు. ఎంపీ నిధులతో ఆలయ పరిరక్షణ కోసం ప్రహరీని నిర్మించాలని నిర్ణయించామన్నారు. గతంలో గ్రామస్తులు ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకుని న్యాయస్థానంలో రెండు పిటీషన్లు వేశారని వాటిని న్యాయ స్థానం కొట్టివేసిందన్నారు. న్యాయస్థానం సూచన మేరకే పనులు చేపడుతున్నామని, ఇందులో తమకు ఎలాంటి స్వార్థం లేదని సురేష్‌నాయుడు తెలిపారు. ప్రహరీని నిర్మించి తీరుతామన్నారు.

పెద్దమ్మతల్లి ఆలయ ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

ఆలయ పరిరక్షణ కోసమే అంటున్న సురేష్‌ నాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement