
అల్ల నేరేడుకు ఊజి దెబ్బ
రాయచోటి : అల్ల నేరేడు శక్తినందించి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు కొన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు ఆకులు, బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం వంటివి నేరేడులో పుష్కలం. అలాంటి అల్ల నేరేడుకు తెగుళ్లు రూపంలో ఊజి పురుగులు వెంటాడుతున్నాయి. నిగనిగలాడే నేరేడు పండును సంతృప్తిగా తిందామన్న వారికి పురుగుల రూపంలో భయపెడుతోంది. నేరేడు పండ్లపై ఈ పురుగులు దాడి చేస్తుండటంతో కాయలు పక్వానికి చేరి మాగకుండానే కుళ్లిపోతున్నాయి. ఫలితంగా సాగు, సర్యరక్షణకు పెట్టిన ఖర్చులు కూడా వస్తాయో లేదో అన్న భయం పట్టుకుంది. కొద్దికొద్దిగా దిగుబడి వచ్చినా ప్రస్తుతం నేరేడు పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కిలో పండ్లు రూ.250లు నుంచి రూ.300లు పైనే అమ్ముతుండటంతో నేరేడు తోటలను సాగు చేసిన రైతులు ఆనందపడుతున్న వేల ఊజీ పురుగుల దాడి వారిని కలవరపాటుకు గురి చేస్తోంది. పండ్లతోటల సాగులో భాగంగా మామిడి, జామ, సపోటా తదితర పండ్ల మొక్కలతోపాటు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న నేరేడు పండ్లతోటల పెంపకానికి రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. చిత్తూరు జిల్లాతోపాటు అన్నమయ్య జిల్లాలో కూడా అధికంగా సాగులో ఉన్న నేరేడు పండ్లను ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.
ఫలితమివ్వని మందుల పిచికారీ..
అల్లనేరేడుకు సోకుతున్న తెగుళ్లు, పురుగుల నివారణకు రకరకాల మందులు పిచికారి చేసినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. గుత్తులు గుత్తులుగా కాయలు కాసి మాగకుండానే మగ్గిపోతుండటాన్ని చూసి రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే మామిడి పంటకు ధరలు లేక కుంగిపోతున్న రైతులు అల్లనేరేడు పంటపై ఊజీ పురుగుల దాడి చూసి వాటి సాగుకు, సంరక్షణకు పెట్టిన డబ్బులు కూడా వచ్చే అవకాశాలు లేవని మథనపడుతున్నారు.
కాయలు పక్వానికి రాకుండానే
కుళ్లిపోతున్న వైనం
రైతులను వెంటాడుతున్న గుబులు
సస్యరక్షణ పెట్టుబడులు కూడా
రావంటున్న రైతులు