
హార్సిలీహిల్స్ సుందరీకరణకు ప్రణాళిక
బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ అభివృద్ధి, సుందరీకణ కోసం ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్రాజేంద్ర తెలిపారు. మంగళవారం ఆయన మదనపల్లె సబ్కలెక్టర్, హార్సిలీహిల్స్ టౌన్షిప్ కమిటీ చైర్మన్ మేఘస్వరూప్, తహసీల్దార్ మొహమ్మద్ అజారుద్దీన్, పీకేఎం ముడా ఇంజినీర్లు, డీఈ సూర్యనారాయణతో కలిసి కొండపై విస్త్రృతంగా పరిశీలనలు నిర్వహించారు. కొండపై అతిథిగృహాలు, గాలిబండ, జిడ్డు సర్కిల్, స్విమ్మింగ్ పూల్, గవర్నర్బంగ్లా తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలి, సుందరీకణ పనులు చేయాలి, వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై సమీక్ష చేశారు. రెవెన్యూ అతిథిగృహం ప్రయివేటుకు అప్పగించగా.. దాన్ని ఎప్పటి లోగా ప్రారంభిస్తారని జేసీ లీజుదారునితో చర్చించారు. రెండు వారాల్లో ప్రారంభిస్తామని చెప్పగా.. త్వరితగతిన పనులు పూర్తి చేసి పర్యాటకులకు గదులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ గాలిబండ వద్ద సందర్శకులు ప్రకృతి అందాలను తిలకించేందుకు బెంచీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిడ్డు సర్కిల్ ప్రాంతాన్ని సుందరీకరిస్తామని, పర్యాటకులు వినియోగించే ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై పారబోయకుండా డస్ట్బిన్లను ఏర్పాటు చేస్తామన్నారు. అరకు కాఫీ హౌస్ను ప్రారంభించడం, కొత్త టాయిలెట్ల నిర్మాణ పనులు చేపడుతామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
జేసీ ఆదర్శ్రాజేంద్ర