
పేదింటి బిడ్డలపై ఫీజులుం
● ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించని కూటమి సర్కార్
● ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని అధికారులు
● సర్టిఫికెట్లు కావాలంటే పెండింగ్ ఫీజు చెల్లించాలంటున్న అధికారులు
● ప్రభుత్వ పెద్దల్లో లోపించిన మానవత్వం.. వాపోతున్న విద్యార్థులు
సాక్షి ప్రతినిధి, కడప : చదువులు అయిపోయాయి... కొలువుల్లో చేరాలనే ఆతృత విద్యార్థులది. ఆ స ర్టిఫికెట్లు కాస్త చేజారితే బకాయిలు పెండింగ్లో ఉండిపోతాయనే ఆందోళన యూనివర్సిటీ యంత్రాంగానిది. వెరసి కూటమి సర్కారు నిర్వాకంతో ఇటు చదువుల బిడ్డలు.. అటు యూనివరర్సిటీ అధికారులు నలిగిపోతున్నారు. వివరాల్లోకి వెళితే..
పేదింటి గ్రామీణ చదువుల బిడ్డలకు ఉన్నత విద్యను అందించాలనే సదాశయంతో ప్రవేశ పెట్టిన ట్రిపుల్ ఐటీపై కూటమి సర్కార్కు చిత్తశుద్ధి లోపించింది. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు విడుదల చేయకుండా తాత్సారం చేస్తోంది. ఫలితంగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ట్రిపుల్ ఐటీ విద్య పూర్తయ్యింది, కొలువుల్లో చేరేందుకు వెళ్లాలి, సర్టిఫికెట్లు జారీ చేయండని విద్యార్థులు అడుగుతుంటే యూనివర్సిటీ అధికారులు చెవికెక్కించుకోవడం లేదు. ఫీజులు పెండింగ్లో ఉన్నాయి, మీరు సర్టిఫికెట్లు తీసుకెళ్తే తమ బకాయిలు ఎలా? అంటూ తిరిగి ప్ర శ్నిస్తున్నారు. బకాయిలు క్లియర్ చేసిన తర్వాత సర్టిఫికెట్లు జారీ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. డబ్బులు చెల్లించే స్థోమత తమకు తమ కుటుంబాలకు లేదని, ప్రభుత్వ బకాయిలు సర్దుబాటుకు కావాల్సిన ఎన్ఓసీ తీసుకొని తమ సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు విన్నవిస్తున్నారు. వారి ఆవేదన పట్టించుకునే స్థితిలో ఆర్జీయూకేటీ యూనివర్సిటీ కన్పించడం లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలనే దిశగా అటు అధికారులకు ఇటు కూటమి నేతలకు కూడా లేకపోవడంతో 8వేల మంది విద్యార్థుల సమస్య పెండింగ్లో ఉండిపోయింది.
చొరవ చూపని ఆర్జీయూకేటీ...
విద్యార్థుల నుంచి ఫీజులు వసూళ్లు చేసుకోవాలనే ఆలోచనకు తగ్గట్లుగా ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు చేయాలనే ఆలోచన ఆర్జీయూకేటీ అధికారుల్లో కన్పించలేదు. ఉన్నత విద్యామండలి దృష్టికి సమస్యను తీసుకెళ్లి, ఫీజు రీయింబర్స్మెంటు బకాయిల వివరాలు సేకరించి, ఎవరెవరికి ఫీజు రీయింబర్స్మెంటు డబ్బులు పడ్డాయి. పేరెంట్స్ అకౌంట్లల్లో ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు పడ్డాయా? అలాంటి వారు బకాయిలు ఎంత ఉన్నాయో తెలుసుకుని వారి సర్టిఫికెట్లు జారీ చేయడానికి అభ్యంతరం చెబితే అర్థం ఉందని విశ్లేషకులు వివరిస్తున్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు చెల్లించని పక్షంలో విద్యార్థుల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు తీసుకొని ప్రభుత్వం నుంచి నేరుగా యూనివర్సిటికీ బకాయిలు చెల్లించేలా ఉన్నత విద్యామండలితో సంప్రదించి సర్టిఫికెట్లు జారీ చేయవచ్చు కదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ దిశగా ఆర్జీయూకేటీ చొరవ చూపడం లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.