
యథేచ్ఛగా ప్రభుత్వ భూముల కబ్జా
పుల్లంపేట : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పుల్లంపేట అడ్డగా మారింది. పుల్లంపేట మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉండగా పది గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకొని రాత్రికి రాత్రే మొక్కలు నాటుకున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నప్పటికీ వారు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఆక్రమణదారులకు రైల్వేకోడూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నా యని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. పుల్లంపేట మండలంలోని కొమ్మనవారిపల్లి, దళవాయిపల్లి, రెడ్డిపల్లి, అనంతంపల్లి, రంగంపల్లి, బావికాడపల్లి, అనంతసముద్రం, వత్తలూరు, దేవసముద్రం, దొండ్లోపల్లి, గారాలమడుగు, తదితర గ్రామాలలో కూటమి ఫ్రభుత్వం అధికారం చేపట్టాక వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. గత ప్రభుత్వంలో ఎనిమిదవ విడత భూ పంపిణీలో భాగంగా పేదలకు పంంచాల్సిన ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. కొమ్మనవారిపల్లి సర్వే నంబరు. 846లో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని మామిడి చెట్ల పెంపకం సాగిస్తున్నారు. అలాగే కొమ్మనవారిపల్లికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండల వ్యాప్తంగా కబ్జాదారులు వారి ఇష్టానుసారం ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారు. దోచుకున్నవారికి దోచుకున్నంత అన్న చందంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారు. జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపించడంతో మండల స్థాయి అధికారులు వారి ఇష్టానుసారం వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మండల అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ పుల్లంపేట మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై ప్రత్యేక అధికారిని నియమించి విచారణ జరిపించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణపై తహసీల్దార్ అరవింద కిషోర్ను వివరణ కోరగా ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆక్రమణదారులకు కొమ్ముకాస్తున్న
రెవెన్యూ అధికారులు