
ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలి
రాయచోటి: మండలాల్లో ప్రభుత్వ భూములకు తగిన విధంగా రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లతో రెవెన్యూ అంశాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆక్రమిత భూముల గుర్తింపు, జీఓ ఎంఎస్ నంబర్.30 మార్గదర్శకాల మేరకు అభ్యంతరలేని ప్రభుత్వ భూములు ఆక్రమణ రెగ్యులరైజేషన్, రీ సర్వే, అందరికీ గృహనిర్మాణం దరఖాస్తులు స్వీకరణ, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు భూముల గుర్తింపు తదితర అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది పథకాలకు భూములు అవసరం అవుతాయని కలెక్టర్ సూచించారు. మండలాల వారీగా సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. ల్యాండ్ రెగ్యులరైజేషన్ పథకం 2025లో భాగంగా ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన మార్గదర్శకాల మేరకు 2019 అక్టోబర్ 15కు ముందు ప్రభుత్వ భూములను అనధికారికంగా ఆక్రమించుకొని ఏర్పరుచుకున్న నివస గృహాలలో అభ్యంతరకరం లేని వాటిని క్రమబద్దీకరణ అంశంలో గుర్తించిన యూనిట్లు, తీసుకున్న చర్యలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. అలాగే హౌసింగ్ రీ వెరిఫికేషన్ పెండింగ్ కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో పచ్చి మేతపెంపకానికి డివిజన్, మండల స్థాయిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, డికేటీ, ప్రైవేటు భూములను ప్రతి మండలంలో కనీసం 3 వేల ఎకరాలను గుర్తించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్ రావు, సబ్ కలెక్టర్లు మేఘస్వరూప్, వైఖోన్ నదియా దేవి, ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్