
గుర్రంకొండ.. చూసోద్దాం రండి
గుర్రంకొండ : జిల్లాలో రాచరికానికి, నవాబులు, రాజులు, బ్రిటీష్ వారి పాలనకు నిలువుటద్దంగా నిలిచిన గుర్రంకొండ కోట వేసవి సెలవుల్లో పిల్లలు, పెద్దలు చూడదగిన ప్రదేశం. జిల్లాకు నడిబొడ్డున ఒక మణిహారంలా విరాజిల్లుతోంది. 14వ శాతాబ్దం నుంచి ఈ కోటను పలు వంశాలకు చెందిన రాజులు, నవాబులు పరిపాలించారు. కడప నవాబు పరిపాలనలో ఈ కోట పేరుగాంచింది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి దేవాలయాలు, చెరువులు ఉన్నాయి. మైసూర్ రాజు టిప్పుసుల్తాన్ బాల్యం, విద్యాభాస్యం ఇక్కడే గడిచింది. చివరగా బ్రిటీషువారితో ఇక్కడ రాజరిక పాలనకు తెర పడింది. ఈ ఘనచరిత్ర కలిగిన ఈ కోటలోఎన్నో విశేషాలు, చూడదగిన ప్రదేశాలు, ఆకట్టుకొనే కట్టడాలు ఉన్నాయి. వేసవి సెలవుల్లో ఈ విశేషాలను తిలకించడానికి రాష్ట్రం నుంచేగాక కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. మనం కూడా ఒకసారి చూసొద్దాం రండి.
రంగిణీ మహ ల్
గుర్రంకొంట కోటలో చూడదగిన ముఖ్య ప్రదేశం రంగిణీమహల్. ఎంతో పురాతన రాజభవనం ఇది. ముందువైపు నుంచి రెండు అంతస్తులుగా, వెనక వైపు నుంచి మూడు అంతస్తులుగా కనిపించడం దీని ప్రత్యేకత. ఎన్నో గదులు, ఓ గదిలో భవనం లోపలి నుంచి సొరంగ మార్గం ఉంది. శత్రు రాజులు దండెత్తినప్పుడు ఈ మార్గంలో కోట బయటకు వెళ్లేందుకు ఈసొరంగం ఒక మార్గంగా ఉండేది. పురాతన మెట్లు, సమావేశపు గదులు రాజరికానికి నిలుటద్దంగా నిలుస్తాయి.
కోటముఖద్వారం
గుర్రంకొండను రాజులు పరిపాలించే కాలంలో కొండ చుట్టూ కోట గోడ నిర్మించారు. చుట్టూ కందకాలు తవ్వి వాటిలో నీరు నింపేవారు శత్రువులు కోటగోడలు ఎక్కకుండా ఆనీటిలో మొసళ్లు వదిలేవారు. అలాంటి కోటకు ముఖద్వారాన్ని నిర్మించారు. ఈ ద్వారం నుంచే ఎవరైనా కోటలోకి ప్రవేశించేవారు. పురాతన కట్టడంగా ఇది నిలుస్తోంది.
షాకమాల్ దర్గా
కోట పక్కనే మగ్బీరా ఉంది. పురాతన మహమ్మదీయుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కట్టడం ఇది. మగ్బీరా అంటే సమాధి. గుర్రంకొండ కోటను టిప్పుసుల్తాన్ మేనమామ మీర్రజాఆలీఖాన్ పాలించేవారు. అతను మృతిచెందిన తరువాత సమాధిని మగ్బీరాగా నిర్మించారు. డూమ్లో చేసే శబ్దాలు ప్రతి ధ్వనించడం ప్రత్యేకత.
కోటలో ఇంకా చూడదగిన విశేషాలు
● కొండపైన కోట బురుజులు, పురాతన కట్టడాలు, పురాతన ఇళ్లు ఉన్నాయి. అక్కడికి చేరుకోవడానికి మెట్లమార్గం కూడా ఉంది.
● కోటలో శిథిలావస్థకు చేరుకొన్న అలనాటి ఆస్పత్రి భవనం ఉంది.
● కోటలో ఆంజనేయస్వామి, విఘ్నేశ్వరస్వామి ఆలయాలు, టిప్పుసుల్తాన్ కాలంనాటి ఈద్గాలు ఉన్నాయి.
● గుర్రంకొండ పట్టణంలో షాకమాల్ దర్గా దర్గా దగ్గర టిప్పుసుల్తాన్ చదువుకొన్న పాఠశాల యూసూఫ్ సాహేబ్ తకియా ఉంది.
● కోట నుంచి పదికిలోమీటర్ల దూరంలో తరిగొండ గ్రామంలో ప్రముఖ రచయిత్రి తరిగొండ వెంగమాంబ ఆలయం ఉంది.
● గుర్రంకొండ పాలకులు టిప్పు సుల్తాన్ చదవుకొన్న యూసూఫ్ సాహేబ్ తకియా(తకియా అంటే పారసీ భాషలో పాఠశాల అని అర్థం). ఇక్కడ ఉంది.
● గుర్రంకొండ కోటలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శ్రీకృష్ణ దేవరాయులు కొండపైభాగంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. రంగిణీ మహల్కు దగ్గరలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి ప్రత్యేకత ఉంది.
● కోట నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సంతాన ప్రదాయిని చెర్లోపల్లె శ్రీ రెడ్డెమ్మకొండ దేవాలయం ఉంది.
● వీటితోపాటు ఇంకా ఎన్నో విశేషాలు గుర్రంకొండ కోటలో చూడవచ్చు.
ఇలా వెళ్లొచ్చు..
● జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లెకు వెళ్లే మార్గంలో 38 కిలోమీటర్ల దూరంలో కడప–బెంగుళూరు జాతీయ రహదారిపై ఉంది.
● తిరుపతి నుంచి మదనపల్లెకు వెళ్లే మార్గంలోని వాల్మికీపురం నుంచి 17 కిలోమీటర్లు ఉంటుది. . ఇదే మార్గంలోనే తరిగొండ వెంగమాంబ ఆలయమున్న తరిగొండ గ్రామం ఉంది.
● తిరుపతి నుంచి నేరుగా అయితే 110 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చిత్తూరు నుంచి నేరుగా అయితే 125 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
● మదనపల్లె నుంచి కడపకు వెళ్లే మార్గంలో అయితే మదనపల్లె నుంచి 33 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
అన్నమయ్య జిల్లాకు
మణిహారం గుర్రంకొండ కోట
వేసవిలో సందర్శించదగిన
చరిత్రాత్మక పర్యాటక కేంద్రం

గుర్రంకొండ.. చూసోద్దాం రండి