
రమణీయం.. రథోత్సవం
● వైభవంగా పుష్పగిరి బ్రహ్మోత్సవాలు
● హరిహరులకు ప్రత్యేక పూజలు
● భారీగా పాల్గొన్న భక్తజనం
వల్లూరు: పుష్పగిరిలోని శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం హరిహరుల రథోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. పుష్పగిరి భక్తజన సంద్రంగా మారింది. ఉదయం శ్రీ వైద్యనాఽథేశ్వరస్వామి రథోత్సవం జరిగింది. శ్రీ కామాక్షీ సమేతుడైన వైద్యనాథస్వామి రథంలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. పూజల అనంతరం శివ నామాన్ని స్మరిస్తూ భక్తులు పోటీ పడి రథాన్ని లాగారు. కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
● సాయంత్రం శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవం జరిగింది. బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి గ్రామోత్సవాలలో వివిధ వాహనాలపై ఒంటరిగా దర్శనమిచ్చిన చెన్నకేశవస్వామి కల్యాణ మహోత్సవంతో పరిపూర్ణుడై శ్రీదేవి, భూదేవిలతో కలిసి రథంపై ఆశీనులయ్యారు. బంగారు ఆభరణాలతో అలంకార భూషితులైన స్వామివారు ఇద్దరు దేవేరులతో కలిసి ద ర్శనమివ్వడంతో.. సాక్షాత్తు వైకుంఠంలోని శ్రీ హరి అంశకు చెందిన శ్రీ వెంకటేశ్వరున్ని ద ర్శించుకున్నట్లుగా భక్తులు పులకించి పోయా రు. ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితు లు ఆధ్వర్యంలో రథం వద్ద పూజలు చేశారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రథ సంప్రోక్షణ, అభిషేకాలు నిర్వహించారు. రథ ప్రారంభ పూజ, వాస్తు పూజ, శాంతి, అష్టబలి, కుష్మాండబలి, ఉత్సవ మూర్తుల దేవతా రాధన, మహా మంగళ హారతి నిర్వహించారు. గోవింద నామాలను జపిస్తూ భక్తులు రథం గొలుసులను పట్టుకుని లాగారు. పుష్పగిరి మాడ వీధుల్లో భక్తులు కాయ కర్పూరాలను సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తలు భారీగా తరలివచ్చారు.
● రథాల వద్ద జరిగిన పూజల్లో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి, ఆలయ అనువంశిక ధర్మకర్త దుగ్గిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, మురళీమోహన్రెడ్డి పాల్గొన్నారు.
పుష్పగిరిలో నేడు
పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి శ్రీ కామాక్షీ వైద్యనాథస్వామి, శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి అశ్వవాహనంపై దర్శనమివ్వనున్నారు.

రమణీయం.. రథోత్సవం