
మూగజీవాలకు శాపం!
సర్కారు నిర్లక్ష్యం..
సాక్షి రాయచోటి: కూటమి సర్కార్ మూగ జీవులపైనా తన ప్రతాపం చూపిస్తోంది. సంచార పశువైద్య వాహనాలను మూలకు నెట్టి వైద్య సేవలను అటకెక్కించింది. ఫలితంగా సమయానికి వైద్యం అందక మూగ జీవాలు అలమటిస్తున్నాయి. మూగజీవాలకూ అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా గత వైఎస్సార్సీపీ సర్కార్ ప్రణాళిక అమలు చేసింది. 2022 మే 19వ తేదీన సంచార పశు వైద్య వాహనాలకు శ్రీకారం చుట్టింది. మహోన్నత ఆశయంతో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచార వాహనాలతో ఉత్తమ వైద్యానికి చర్యలు చేపట్టారు. ప్రతి నియోజకవర్గానికి ఒక వాహనాన్ని కేటాయించి గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కడైతే పశువుకు బాగాలేదో ఆ ఇంటి వద్దనే వైద్యం అందించాలని సంచార పశు వైద్య వాహనాన్ని అప్పగించారు. అప్పటి నుంచి నిరంతరాయంగా సేవలందిస్తున్న సంచార పశు వైద్య వాహనాలను ప్రస్తుత కూటమి సర్కార్ పట్టించుకోవడం మానేసింది. ఫలితంగా రెండు నెలలుగా వాహనాలు మూలకు చేరా యి. కాంట్రాక్టు గడువు ముగియడంతో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు వీటిని నిలిపివేశారు. ప్రస్తుతానికి జిల్లా అంతటా ఏడు వాహనాలతో అరకొర వైద్య సేవలు అందుతున్నాయి.
పశు యజమానులకు కష్టకాలం
జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్లు, గేదెలు, ఆవులు, ఎద్దులు, ఇతర పెంపుడు జంతువులు ఉన్నాయి. సంచార పశు వైద్య వాహనం ద్వారా ఎక్కడికక్కడ సమస్య ఉన్నచోటనే..జంతువును వాహనంలోకి హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా ఎక్కించి అక్కడే అన్ని పరీక్షలు చేసేవారు. పశువుల సంరక్షణ కోసం 20 రకాల మల సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్తోపాటు ఆటోగ్లేవ్ ప్రయోగశాలను కూడా సంచార వాహనంలో అందుబాటులో ఉంచారు. హైడ్రాలిక్ లిఫ్ట్ సిస్టమ్ ఉండడంతో ఆవు, గేదె వాహనంలోకి సులువుగా ఎక్కించేందుకు వీలు ఉండేది. అత్యున్నత టెక్నాలజీతో వాహనాన్ని తీర్చిదిద్దారు. అయితే దీనికి 108, 104 తరహాలోనే ఒక నంబరును కేటాయించి ఫోన్ చేయగానే గ్రామాలకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో అరకొర వాహనాలతో తూతూ మంత్రంగా వైద్యసేవలందుతున్నాయి. గ్రామీణ ప్రాంత పశువులకు, ఇతర జంతువులకు ఉపయోగపడే ఈ పథకంపై ప్రస్తుత సర్కార్ నిర్లక్ష్యం చూపడంపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంచార పశు వైద్య వాహనాల కాంట్రాక్టు పొడిగించడంపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో అంతుచిక్కడం లేదని పలు వురు పశువుల యజమానులు ప్రశ్నిస్తున్నారు.
సంచార పశు వైద్య సేవ వాహనాలకు గడువు ముగిసినా పట్టించుకోని ప్రభుత్వం
పల్లెల్లో కరువవుతున్న పశువైద్యం
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పశు యజమానులు