
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు
మదనపల్లె : ఆంధ్ర ప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారని, ప్రజాస్వామ్య బద్ధంగా కాకుండా ప్రత్యర్థులను వేధించడమే పనిగా కూటమి పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్తిప్పారెడ్డి, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్కుమార్రెడ్డి అన్నారు. మదనపల్లెలోని ఎంపీ మిథున్రెడ్డి కార్యాలయంలో విలేకరులతో దేశాయితిప్పారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లి ప్రజల బాగోగులు చూడాలని కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కడితే, ప్రత్యర్థులను వేధించడమే పనిగా పాలన సాగిస్తున్నారన్నారు. మదనపల్లె ఫైల్స్ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న గౌతమ్తేజ్ లై డిటెక్టర్ నివేదికలో తనమీద ఎలాంటి ఒత్తిడి లేదని, ఘటనలో తన ప్రమేయం లేదని స్పష్టంగా పేర్కొన్నా, తనను ఎవరూ ప్రభావితం చేయలేదని చెప్పినప్పటికీ.. ప్రభుత్వం కక్ష కట్టి వేధిస్తోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అంగళ్లు కేసును తప్పుడు ఎఫ్ఐఆర్ అని ఏ విధంగా కొట్టివేసిందో, ఇందులో ఎఫ్ఐఆర్ ఎవరు రాశారో? ఎందుకు కొట్టేస్తున్నారో? అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం నమోదు చేసిన మద్యం, మదనపల్లె ఫైల్స్ కేసుల్లో కానీ, పెద్దిరెడ్డి, ఎంపీ కుటుంబంపై మోపుతున్న అభాండాలు, అభియోగాలకు ఆధారాలు చూపండంటూ సాక్షాత్తూ ఎంపీ ప్రశ్నిస్తున్నప్పటికీ చూపలేకపోయారన్నారు. ఎల్లో మీడియాలో కథనాలు రావడం, వాటి ఆధారంగా దర్యాప్తు అధికారులు కేసులు నమోదు చేయడం, వేధింపులకు పాల్పడడం జరుగుతోందన్నారు. మదనపల్లె వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్అహ్మద్ మాట్లాడుతూ...పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరాభిమానాలను చూసి తట్టుకోలేక, వారి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలనే లక్ష్యంతో తప్పుడు కేసులను తెరపైకి తీసుకొస్తున్నారన్నారు. మదనపల్లె ఫైల్స్ కేసులో ఎవరికి, ఎలాంటి ప్రమేయం లేనప్పటికీ, హెలికాప్టర్లో ఉన్నతాధికారులను పంపించి, డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారన్నారు. మద్యం కేసులో ఎంపీ మిథున్రెడ్డిని చేర్చడం, ఫారెస్ట్ భూములు ఆక్రమించారంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేడయం చేస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్కుమార్రెడ్డి మాట్లాడుతూ...మదనపల్లె ఫైల్స్ కేసు విషయంలో నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తుచేసి కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులపై నమోదుచేయిస్తున్న కేసులన్నీ దురుద్దేశంతో కొందరిని లక్ష్యంగా చేసుకుని పెడుతున్నవేనని ప్రజలందరికీ అర్థమవుతోందన్నారు. కార్యక్రమంలో ఏపీఎండీసీ మాజీ చైర్పర్సన్ షమీంఅస్లాం, మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యర్థులను వేధించడమే పనిగా కూటమి పాలన
పెద్దిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు
మదనపల్లె ఫైల్స్ ఘటనలో ప్రమేయం లేదని చెప్పినా ఆగని వేధింపులు