కురబలకోట : రూ.759 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరువు రైతుల కల్పతరువు ముదివేడు రిజర్వాయర్కు భూములు కోల్పోతున్న నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం నిధులు విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసిందని హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్–2 పీలేరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ 20 రోజుల్లోగా నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. పిచ్చలవాండ్లపల్లె గ్రామ రైతులకు రూ.45 కోట్లు, ముదివేడు గ్రామ రైతులకు రూ. 95 లక్షలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయన్నారు.
ఆర్ అండ్ ఆర్ కాలనీకి ఆర్డీఓ స్థల పరిశీలన
రిజర్వాయర్ బాధితుల పునరావాసానికి కూడా శరవేగంగా చర్యలు చేపట్టినట్లు మదనపల్లె ఆర్డీఓ మురళి తెలిపారు. బాధిత రైతులు కోరిన మేరకు ముదివేడు ఫారెస్టు వద్ద ఎంఐజీ ప్లాట్ పక్కన 25 ఎకరాలకు పైగా ఆర్ అండ్ఆర్ కాలనీ ఏర్పాటుకు భూములను ఆయన పరిశీలించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. తహసీల్దార్ ఎం. భీమేశ్వరరావు మాట్లాడుతూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రత్యేక చొరవ, సహకారంతో బాధితులకు త్వరలో పరిహారం నిధులు మరో వైపు సత్వరం పునరావాస కల్పనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆర్ఐ సుగుణ, సర్వేయర్ భువనేశ్వరి, వీఆర్ఓ వేణుగోపాల్రెడ్డి, కులదీప్ రెడ్డి పాల్గొన్నారు.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోపాలకృష్ణ