టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Slams Chandrababu over test rules | Sakshi
Sakshi News home page

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

Jul 8 2026 3:02 PM | Updated on Jul 8 2026 4:32 PM

YS Jagan Slams Chandrababu over test rules

తాడేపల్లి: టెట్‌ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు పట్టించుకోకపోవడం అన్యాయమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. 2011 ముందు నుంచి టీచర్లుగా ఇప్పటికీ పనిచేస్తున్న వారు కూడా టెట్‌ పరీక్ష తప్పనిసరిగా పాస్‌ కావాలన్న నిబంధన పెట్టడంతో దాదాపు లక్షమందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘‘20-25 ఏళ్లకు పైబడి సబ్జెక్టు టీచర్లుగా కొనసాగుతున్న వీళ్లు, ఇప్పుడు అన్ని సబ్జెక్టుల సిలబస్‌తో ఉన్న టెట్‌ పరీక్ష పాస్‌కావాలని, అందులోకూడా గరిష్టంగా 60శాతం మార్కులు రావాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? పైగా వీళ్లంతా అప్పట్లో డీఎస్సీ ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణులు కాబట్టేకదా ఉద్యోగాలు వచ్చాయి? వారికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అప్పట్లో “టెట్‌’’ అనే పరీక్షే లేనప్పుడు, ఇప్పుడు వీళ్లుకూడా టెట్‌ పరీక్షలో పాస్‌ కావాలని రూల్‌ పెట్టడం ఎంతవరకు కరెక్టు?’’ అని నిలదీశారు.

టీచర్లకు మానసిక ఒత్తిడి 
టీచర్లందరికీ టెట్‌ను తప్పనిసరి చేస్తూ జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 నుంచి టెట్‌ను తప్పనిసరి చేస్తే, ఈ చట్టం రాకముందు నుంచే టీచర్‌ ఉద్యోగాలు చేస్తున్నవారికి “టెట్‌’’ పరీక్షను ఎందుకు తప్పనిసరి చేస్తున్నారంటూ వాళ్లు చేస్తున్న వాదనలో న్యాయం ఉంది కదా? అని వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘‘అప్పట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌ పాస్‌ అయిన తర్వాతే వారికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది కదా?  టెట్‌ పరీక్ష నిబంధన కారణంగా ప్రమోషన్ల సమస్యే కాకుండా, చివరకు ఉద్యోగభద్రత లేకుండా చేస్తున్నారని, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని టీచర్లంతా వాపోతున్నారు. 

కానీ, చంద్రబాబు ఈ టీచర్ల ఇబ్బందుల గురించి పట్టించుకోవడంలేదు. చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలన్న ధ్యాసకూడా ఆయనకు లేకుండా పోయింది. టెట్‌ రాకముందు అంటే 2011కు ముందు సర్వీసులో ఉన్న టీచర్లందరికీ, టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి, టీచర్లకు ఉపశమనం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నాను. వారంతా అప్పట్లో కాంపిటేటివ్ పరీక్షలు పాస్‌ అయిన తర్వాతనే వారికి ఉద్యోగాలు వచ్చాయి అన్నది మరిచిపోకూడదు అనికూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మరొక్కసారి’’ అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement