ఫోన్ చేసిన తర్వాత గంటన్నర ఆలస్యంగా చేరుకున్న వాహనం
ప్రకాశం జిల్లాలో ఘటన
టంగుటూరు: 108 వాహనం గంటన్నర ఆలస్యంగా రావడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు పంచాయతీ పరిధిలోని రాయివారిపాలెంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కట్టా శంకరమ్మ శనివారం సాయంత్రం ఇంటి వద్ద స్పృహ కోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏదో ఒక సాకు చెబుతూ వచ్చారు. చివరకు గంటన్నర ఆలస్యంగా 108 గ్రామానికి చేరుకోగా అప్పటికే ఆమె మృతి చెందింది.
108 వాహనం సకాలంలో వచ్చి ఉంటే తన తల్లి బతికేదని మృతురాలి కుమారుడు బాబూరావు కన్నీరు మున్నీరుగా విలపించాడు. కాగా రెండు రోజుల క్రితం కందుకూరుకు ఒక రోగిని దింపడానికి వెళ్తుండగా 108 వాహనం మార్గమధ్యంలోనే ఆగిపోయింది. వాస్తవానికి ఒంగోలు నుంచి వెళ్తూ సూరారెడ్డిపాలెంలోని ఐఓసీ పెట్రోల్ బంకులో డీజిల్ నింపుకోవాల్సి ఉండగా 108 సిబ్బంది నిర్లక్ష్యంతో సింగరాయకొండలో నింపుకుందామని బయలుదేరారు. తీరా కందుకూరు కొంత దూరం ఉందనగా డీజిల్ ఆయిపోయి ఆగిపోవడంతో మరో వాహనంలో రోగిని తరలించాల్సి వచ్చింది.


