కలగర(ఎన్టీఆర్ జిల్లా): రైతుల కష్టాన్ని ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు దోచుకుంటున్నారని ఆరోపిస్తూ రైతులు ఎదురుతిరిగారు. విస్సన్నపేడ మండలం కలగరలో రైతు భరోసా కేంద్రంగా చిన్ని వర్గీయులు దందా నడిపిస్తున్నారని రైతులు ఆందోళన బాట పట్టారు. దళారుల పేరుతో దోచుకుంటున్నారని రైతులు ఎదురుతిరిగారు. అక్కడ రైతులు ఆందోళనకు దిగడంతో కలగర రైతు భరోసా కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
దీంతో ఎంపీ చిన్నిపై గుర్రుగా ఉన్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అక్కడకు చేరుకున్నారు. ఎంపీ వర్గం దోపిడీపై కొలికపూడి మండిపడ్డారు. ఎంపీ వర్గం వ్యక్తులకు సహకరిస్తున్న ఎమ్మార్వోపై ధ్వజమెత్తారు. దళారులకు ఎమ్మార్వో కొమ్ము కాస్తున్నారంటూ విమర్శించారు. ఉదయం నుంచి రైతుల ఆందోళన చేస్తుంటే మీకు పట్టదా అంటూ ఎమ్మార్వో తీరును తప్పుబట్టారు.
ఎమ్మార్వోతో పాటు ఎంపీ వర్గంపై కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు పెద్ద రైతులత కోసం చిన్న రైతుల పొట్టకొడుతున్నారని ఆరోపించారు. ఎమ్మార్వోతో పాటు ఓ నలుగురు రైతులు దోచుకుంటున్నారని, దొంగలను ఎమ్మార్వో కాపాడుతున్నారన్నారు. ఎమ్మార్వోను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కొలికపూడి.


