ప్రత్యేక విద్యార్థులకు స్పెషల్ టీచర్లను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
ఇందుకు కొత్త పోస్టులు సృష్టించాల్సిందిపోయి.. ప్రభుత్వం అడ్డదారులు
రెగ్యులర్ టీచర్ పోస్టుల్లో 2,260 పోస్టులను మిగులుగా చూపి,వాటిని స్పెషల్ టీచర్ పోస్టులుగా మార్పు
ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నట్టు ప్రకటన
ఏడాది కాలంగా నోటిఫికేషన్ జారీ చేయని పరిస్థితి
ఆందోళనలో స్పెషల్ బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు
ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులపై సర్కార్ నిర్లక్ష్యానికి నిలువుటద్దం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆటిజం, బుద్ధిమాంద్యం వంటి ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల కోసం స్పెషల్ టీచర్లను నియమించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఏడాది గడిచినా కార్యరూపం దాల్చలేదు. అత్యున్నత న్యాయస్థా నం ఇచ్చిన నిర్దేశాలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త పోస్టులు సృష్టించాల్సింది పోయి, ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలోని రెగ్యులర్ టీచర్ పోస్టు ల్లో 2,260 పోస్టులను సర్ప్లస్(మిగులు)గా చూపి వాటిని స్పెషల్ టీచర్ పోస్టులుగా (1,136 స్పెష ల్ ఎస్జీటీలు, 1,124 స్పెషల్ స్కూల్ అసిస్టెంట్) మార్పు చేసింది.
ఈ మేరకు గతేడాది ఏప్రిల్లో ప్రభుత్వం జీఓనెం.13ను విడుదల చేసింది. అనంతరం ఆర్థిక ఆమోదం తెలపడంతోపాటు గత మేలో ఈ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ప్రక టన సమయంలో సహా పలు సందర్భాల్లో ప్రభు త్వం స్పెషల్ టీచర్ పోస్టుల (డీఎస్సీ) భర్తీకి చర్య లు చేపడుతున్నట్టు ప్రకటించి అభ్యర్థుల్లో ఆశలు పెంచింది. వాస్తవంలో మాత్రం ఏడాది కాలంగా నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో స్పెషల్ బీఈడీ, డీఎడ్ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
5 వేల వరకూ ఖాళీలు..
స్పెషల్ టీచర్ల నియామకానికి సంబంధించి విద్యాశాఖ 13 ఉమ్మడి జిల్లాల్లోనూ గుర్తించిన ఖాళీలు ఒక్క పాఠశాల విద్యాశాఖలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూళ్లకు సంబంధించినవి మాత్రమే కావడం మరో విశేషం. మిగిలిన ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మహాత్మ జ్యోతిబాపూలే, జువైనల్, మోడల్ స్కూల్స్ తదితర శాఖలు ఇప్పటికీ ఆయా స్కూళ్లల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రకటించలేదు. పైగా ఈ ఖాళీలపై ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద స్పష్టత కూడా లేదు. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఖాళీలు కలిపి మొత్తం 5 వేల వరకు ఉంటాయని అంచనా.
దివ్యాంగ విద్యార్థుల వికాసమే లక్ష్యంగా...
⇒ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 10 మంది విద్యార్థులకు ఒకరు, ఉన్నత పాఠశాలల్లో ప్రతి 15 మందికి ఒక స్పెషల్ టీచర్ ఉండాలని ఆర్టీఈ–2009 చట్టంలో 2022 సవరణ చెబుతోంది.
⇒ దివ్యాంగ విద్యార్థులకు సమాన విద్యావకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
⇒ స్పెషల్ టీచర్లను నియమించాలని ప్రభుత్వాలకు గతేడాది మార్చిలో విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది.
విద్యకు దూరమవుతున్న స్పెషల్ విద్యార్థులు
రాష్ట్రంలో సమగ్ర శిక్ష కింద 679 భవిత కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో 9 వేల మంది ఆటిజం, బుద్ధిమాంద్యం పిల్లలు చదువుకుంటున్నారు. ఇక భవిత కేంద్రాల పరిధిలో దాదాపు 80 వేల మంది స్పెషల్ విద్యార్థులున్నారు. వీరిలో 1–5 తరగతుల వయసు వారు 17 వేల మంది భవిత కేంద్రాల్లో ఉన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యాబుద్ధులు నేరి్పంచేందుకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్టీ) 1,286 మంది కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. వీరంతా స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినవారే. మిగిలిన 63 వేల మంది విద్యార్థులు స్థానిక ప్రాథమిక, యూపీ, ఉన్నత పాఠశాలల్లో చేరినా స్పెషల్ టీచర్లు లేక విద్యకు దూరమవుతున్నారు. ప్రస్తుతమున్న 6 స్పెషల్ స్కూళ్లల్లోనూ ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది.
‘భవిత’ స్పెషల్ టీచర్ల ఆందోళన
భవిత సెంటర్లలో 10 ఏళ్లుగా పనిచేస్తున్న వారి సర్వీసును రెగ్యులర్ చేయాలని లేదా రెగ్యులర్ టీచర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని గతేడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం హడావుడిగా వీరి అర్హతలను నిర్ధారించేందుకు కమిటీని నియమించింది. కానీ ఇంత వరకు దీనిపై ఎటూ తేల్చలేదు. సుప్రీం తీర్పు నేపథ్యంలో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వారంతా తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మభ్యపెట్టే ధోరణి అవలంభించడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.


