పల్నాడు జిల్లాలో యువకుడు కిడ్నాప్‌! | Palnadu district incident: Andhra pradesh | Sakshi
Sakshi News home page

పల్నాడు జిల్లాలో యువకుడు కిడ్నాప్‌!

Oct 23 2025 4:06 AM | Updated on Oct 23 2025 4:06 AM

Palnadu district incident: Andhra pradesh

దమ్మాలపాడు (ముప్పాళ్ళ): పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో పోలీసుల పేరుతో ఓ యువకుడిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన షేక్‌ నాగూర్‌ షరీఫ్‌కు పిడుగురాళ్లలో మెకానిక్‌ దుకాణం ఉంది. బుధవారం మధ్యాహ్నం పనిలో ఉండగా దుకాణం వద్దకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పోలీసులమని చెప్పి కారులో తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత ఫోన్‌ స్విచ్ఛాప్‌ రావ­డంతో మరింత ఆందోళనకు గురైన నాగూర్‌ షరీఫ్‌ భార్య తల్లిదండ్రులకు సమాచారం అందించింది.

తన భర్తపై ఎలాంటి కేసులు లేవని, పోలీసులమని చెప్పి మఫ్టీలో వచ్చి ఎలా తీసుకెళ్తారని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. తన భర్తకు ఎలాంటి హాని జరిగినా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. నాగూర్‌ షరీఫ్‌ ముప్పాళ్ల మండలం, తొండపి ఎంపీటీసీ బందెల హుస్సేన్‌బీ అల్లుడు. ఈనెల 28న ఎంపీపీ అవిశ్వాస తీర్మానం ఉన్న నేపథ్యంలోనే ఈ కిడ్నాప్‌ డ్రామాకు తెరదీశారని ప్రచారం జరుగుతోంది. ఎంపీపీ పదవిపై కన్నేసిన టీడీపీ శ్రేణులు తమ కుటుంబ సభ్యులను కూడా వదలకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement