‘బైక్ కావాలి’ అంటూ భార్యను వేధించిన ఇంజినీర్ భర్త! | New Bride Woman Ends Life In Srikakulam | Sakshi
Sakshi News home page

‘బైక్ కావాలి’ అంటూ భార్యను వేధించిన ఇంజినీర్ భర్త!

May 10 2026 8:30 AM | Updated on May 10 2026 10:38 AM

New Bride Woman Ends Life In Srikakulam

శ్రీకాకుళం క్రైమ్‌/గార : వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. ఉరేసుకుని చనిపోయిందని భర్త చెబుతుండగా.. అల్లుడే తమ కుమార్తెను చంపేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం శిమ్మపేటకు చెందిన శిమ్మ లక్ష్మీ నారాయణ, శారద దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి కుమారుడు గౌతమ్, డిగ్రీ బీఎస్సీ చదివిన కుమార్తె తేజశ్రీ(22) ఉన్నారు. తేజశ్రీకి శ్రీకాకుళం మండలం రాగోలు సమీప గూడెంకు చెందిన రుప్ప మల్లేషు కుమారుడు సోమేష్‌తో ఈ ఏడాది మార్చి 6న వివాహం జరిగింది. కట్నం కింద రూ. 20 లక్షల నగదు, 20 తులాల బంగారం చెల్లించారు.  

మొదటి రోజు నుంచే వేధింపులు..  
విశాఖపట్నం ఎల్‌అండ్‌టీ కంపెనీలో ఇంజినీర్‌గా ఉన్న సోమేష్‌  నావల్‌ డాక్‌యార్డ్‌లో ప్రాజెక్టు డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. విశాఖ రామా టాకీస్‌ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల ఓ యువతిని సోమేష్‌ ఇంటికి తేవడంతో తేజశ్రీ భర్తను నిలదీసింది. అది సహించని సోమేష్‌ రూ.3 లక్షల విలువైన బైక్‌ కావాలని వేధించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులకు తేజశ్రీ విషయం చెప్పడంతో నాలుగైదు రోజుల్లోనే బండి కొనిచ్చేశారు. వారం రోజుల తర్వాత పది సెంట్లు భూమి రాయాలని, తులం నల్లపూసలు చేయించాలని మళ్లీ వేధించడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పింది. పెళ్లి ఆల్బమ్‌లో సగం మొత్తం రూ. 1.50 లక్షలు అడగడంతో రూ.50 వేలు సైతం ఇచ్చారు.  

గొడవవుతుందని..  
ఈనెల 7వ తేదీన ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య సోమేష్, తేజశ్రీల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ తమకు ఫోన్‌ చేశారని, గొడవ మామూలేనని తేజశ్రీ తమతో చెప్పిందని, ఆ తర్వాత పలు దఫాలు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. 9.30 గంటలకు ఉరివేసుకుని మీ పాప చనిపోయిందని తన ఫ్రెండ్‌తో సోమేష్‌ ఫోన్‌ చేయించడంతో ఒక్కసారి హతాశులయ్యామని, వెంటనే విశాఖ బయల్దేరి వెళ్లామని పేర్కొన్నారు. 

అక్కడికి వెళ్లి చూసేసరికి కుమార్తె బెడ్‌ మీద విగతజీవిగా ఉందని, మెడ, కాళ్లపై వాతలున్నాయని, సోమేష్‌ స్నేహితులు ముగ్గురు అక్కడే ఉండటంతో ఆమెను చంపేసి వుంటారని తాము భావిస్తున్నట్లు  పేర్కొన్నారు. ఇదే విషయమై విశాఖ   పట్నం త్రీటౌన్‌లో కేసు పెట్టామని, సోమేష్‌ను అదే రోజు పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. తమ కుమార్తెకు తీరని అన్యాయం జరిగిందని.. అదనపు వరకట్నం కోసం వేధించడమే కాక హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు వాపోయారు.  

Advertisement
 
Advertisement
Advertisement