నేడు దేశవ్యాప్తంగా నీట్ యూజీ–2026
దేశవ్యాప్తంగా 552 కేంద్రాలు, పట్టణాల్లో నిర్వహణ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ యూజీ)–2026ని ఆదివారం దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత నిమిషం ఆలస్యమైనా సెంటర్లలోకి అనుమతించరు. ఆఫ్లైన్ (పెన్ను, పేపర్) విధానంలో దేశవ్యాప్తంగా 552 నగరాలు, పట్టణాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 29 నగరాలు, పట్టణాల్లో పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 22.80 లక్షల మంది విద్యార్థులు నీట్ రాస్తారని అధికారుల అంచనా. గతేడాది ఏపీ నుంచి 57,934 మంది విద్యార్థులు నీట్ రాయగా, 36,776 మంది అర్హత సాధించారు. ఈసారి కూడా 55వేల మందికి పైగా విద్యార్థులు నీట్ రాసే అవకాశం ఉందని తెలుస్తోంది.
డ్రెస్ కోడ్
⇒ విద్యార్థులు తేలికపాటి దుస్తులు ధరించాలి.
⇒ పూర్తి చేతుల చొక్కా (ఫుల్ స్లీవ్స్), ఉన్ని దుస్తులు ధరించే విద్యార్థులు తనిఖీల కోసం పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయం కంటే ముందే చేరుకోవాలి.
⇒ సంప్రదాయ, మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన వస్తువులను ధరించేవారు క్షుణ్ణంగా తనిఖీలు చేయడానికి వీలుగా పరీక్ష కేంద్రంలో ముందుగానే రిపోర్ట్ చేయాలి.
⇒ స్లిప్పర్స్ లేదా ఎత్తు తక్కువ ఉన్న చెప్పులు మాత్రమే ధరించాలి.
నిబంధనలు ఇవే...
పరీక్ష కేంద్రంలోకి అనుమతించేవి
⇒ అడ్మిట్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫొటో, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, వంటి ధ్రువీకరణ పత్రాలు).
⇒ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్.
నిషేధిత వస్తువులు
⇒ మొబైల్ ఫోన్లు
⇒ స్మార్ట్ వాచీలు
⇒ ఎలక్ట్రానిక్ పరికరాలు
⇒ క్యాలిక్యులేటర్లు
⇒ ఇతర కాగితాలు
బయోమెట్రిక్పై ఆందోళన వద్దు
ఏ కారణంతో అయినా బయోమెట్రిక్ నమోదుకాకపోతే విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బయోమెట్రిక్ నమోదు కాని విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించి, లిఖితపూర్వకంగా అండర్టేకింగ్ తీసుకుంటారు. ఇందుకు సంబంధించిన నమూనాను ప్రతి పరీక్ష కేంద్రానికి పంపినట్లు ఎన్టీఏ ప్రకటించింది.


