ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకు 13 కేటగిరీల్లో 11,639 ఖాళీలు
హోం శాఖ నివేదిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయి. అధికారులు, సిబ్బంది కొరత పోలీసు శాఖను వేధిస్తోంది. 11,639 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని హోం శాఖ ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించింది. ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకు 13 కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని ఆ నివేదికలో పేర్కొంది. కాగా దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించ లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు నియామక మండలి పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది. 411 ఎస్సై పోస్టులకు 2022లో నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్షలు నిర్వహించి భర్తీ చేసింది.
6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష నిర్వహించింది. కాగా న్యాయపరమైన వివాదాలతో పోస్టుల భర్తీకి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ నోటిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగానే ఆ కానిస్టేబుల్ పోస్టులకు ప్రభుత్వం నియామక ఉత్తర్వులు ఇచ్చింది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా పోలీసు శాఖలో ఖాళీల భర్తీపై ఇంకా దృష్టి సారించ లేదు.


