సాగరతీరాన్నిశోధిద్దాం.. | Establishment of Coastal Research Center at Dolphin's Nose | Sakshi
Sakshi News home page

సాగరతీరాన్నిశోధిద్దాం..

Mar 11 2023 4:03 AM | Updated on Mar 11 2023 6:00 PM

Establishment of Coastal Research Center at Dolphin's Nose - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఉష్ణమండల తుపాన్లు, రుతుపవన సీజన్‌లో వచ్చే వరదలు, సముద్ర మట్టాల పెరుగుదల, మడ అడవుల విస్తీర్ణం తగ్గుదల, కాలుష్య కారకాలు పెరుగుతున్న నేపథ్యంలో సాగర తీరంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఇటీవల కాలంలో దేశంలోనే రెండో అతి పెద్ద తీర రేఖ కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తీరం కోతకు గురవుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశోధనలు చేస్తోంది.

ఈ తరుణంలో మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ అనుబంధ సంస్థ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌(ఎన్‌సీసీఆర్‌) ఏపీ తీర ప్రాంత పరిరక్షణ­కు నడుం బిగించింది. రాష్ట్ర ప్రభుత్వ సహ­కారంతో తీరంలో తలెత్తుతున్న అలజడులపై పరిశోధనలు నిర్వహిస్తూ.. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలకు ఉపక్రమించేలా పక్కా ప్రణాళికలతో అడుగులేస్తోంది.

డాల్ఫిన్‌ నోస్‌పై 5.5 ఎకరాల విస్తీర్ణంలో.. 
విశాఖ నగరానికి పెట్టని కోటలా.. రక్షణ వ్యవస్థకు పెద్దన్నలా వ్యవహరిస్తున్న డాల్ఫిన్‌ నోస్‌పై ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రూ.62 కోట్ల వ్యయంతో 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేయనున్నారు. పరిశోధన కేంద్రంతో పాటు ఎర్త్‌సైన్స్‌ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా నిర్మస్తున్నారు. లేబోరేటరీ భవనం, పరిశోధన భవనం, వర్క్‌షాప్, ఆడిటోరియం, సెమినార్‌హాల్, గెస్ట్‌ హౌస్, హాస్టల్‌తో పాటు ఇతర భవనాలను నిర్మించనున్నారు.

మన తీరంలో ఉన్న సమస్యలపై ముఖ్యంగా ఈ కేంద్రం పరిశోధనలు చేయనుంది. ప్రతి సమస్యపై పరిశోధనలు నిర్వహించి వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి.. సమస్య నివారణకు తగిన చర్యలు తీసుకుంటుంది.  ఇప్పటికే దేశవ్యాప్తంగా షోర్‌లైన్‌ మేనేజ్‌మెంట్‌ అట్లాస్‌ సిద్ధం చేసిన ఎన్‌సీసీఆర్‌.. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ షోర్‌లైన్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ను తయారు చేయనుంది. దీని ద్వారా ఏఏ తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి? వాటిని ఎలా పరిష్కరించాలనే విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.

తీరంలో ఎక్కడెక్కడ ఎంత మేర కాలుష్యం ఉంది? దీనివల్ల మత్స్య సంపద, జీవరాశులకు ఎలాంటి విఘాతం కలుగుతోంది? దీని వల్ల సముద్రాల్లో వస్తున్న మార్పులు, మడ అడవులు విస్తీర్ణం తగ్గడం వల్ల తలెత్తుతున్న ప్రమాదాలు.. తదితర వాటిపై నిరంతరం పరిశోధనలు ఇకపై విశాఖ కేంద్రంగా జరగనున్నాయి.

ఏపీ సముద్ర జలాల పరిరక్షణకు కృషి 
విశాఖలో నిర్మిస్తున్న పరిశోధన కేంద్రం ద్వారా సముద్రజలాల నాణ్యత మానిటరింగ్, ప్రిడిక్షన్‌ ఆఫ్‌ కోస్టల్‌ వాటర్‌ క్వాలిటీ(పీడబ్ల్యూక్యూ), ఎకోసిస్టమ్‌ సర్వీస్ , సముద్ర తీర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు.. తదితర అంశాలపై పరిశోధనలు చేస్తాం.

సముద్రంలో చేరుతున్న కాలుష్య కారకాలు, పెరుగుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలపైనా దృష్టి సారిస్తాం. ఈ కేంద్రం ద్వారా ఏపీ సముద్ర జలాల పరిరక్షణకు ఎన్‌సీసీఆర్‌ పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని విశ్వసిస్తున్నాం.    
– డా.ఎంవీ రమణమూర్తి, ఎన్‌సీసీఆర్‌ డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement