పనుల నాణ్యతలో రాజీ పడొద్దు..

CM YS Jagan Review On Pulivendula Area Development Agency - Sakshi

పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (పాడా)పై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

సాక్షి, అమరావతి: పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (పాడా)పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన  క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డితో పాటు, పలువురు అధికారులు హాజరయ్యారు. పులివెందుల, మైదుకూరు, కమలాపురం, రాయచోటి నియోజకవర్గాలతో పాటు, కడప నగరంలో పలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. (చదవండి: వడివడిగా జీవనాడి

చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో తొలిసారిగా పూర్తిస్థాయిలో 10.14 టీఎంసీల నీరు నిల్వ చేసినట్లు అధికారుల వెల్లడించారు. ఈఏపీ కింద గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.184 కోట్లతో 76 రహదారుల నిర్మాణానికి  టెండర్లు పిలుస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ అన్ని రంగాలలో పనులు చేపడుతూ, దశల వారీగా పులివెందులను మోడల్‌ టౌన్‌గా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. (చదవండి: తప్పుడు ప్రచారాలపై సీఎం జగన్‌ ఆగ్రహం)

 సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
‘‘పనుల్లో జాప్యం ఉండొద్దు. ఎక్కడైనా భూమి పూజ (ఫౌండేషన్‌) చేసిన తర్వాత వీలైనంత త్వరగా పనులు మొదలు కావాలి. పనుల్లో ఏ మాత్రం జాప్యం జరగకూడదు. నిర్ణీత వ్యవధిలోగా వాటిని పూర్తి చేయాలి. అలాగే పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దు. సాగు నీటి కింద మంజూరైన వివిధ పనులకు జ్యుడీషియల్‌ ప్రివ్యూ వేగంగా పూర్తి చేసి టెండర్లు పిల్చి పనులు మొదలు పెట్టాలని’’ తెలిపారు.

జాతీయ రహదారి ప్రమాణాలతో..:
‘‘ముద్దనూరు–కొడికొండ చెక్‌పోస్టు రహదారి చాలా కీలకమైంది. ఇది చాలా ముఖ్యమైన రహదారి. నిత్యం రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాతీయ రహదారి మాదిరిగా ముద్దనూరు–కొడికొండ చెక్‌పోస్టు రహదారిని నిర్మించాలని’’ చెప్పారు.

మోడల్‌టౌన్‌గా పులివెందుల:
‘‘అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్‌ నిర్మాణం, సిటీ సెంటర్, సెంట్రల్‌ బోలీవార్డు, స్లాటర్‌ హౌజ్‌ల నిర్మాణం. అన్ని లేఅవుట్లలో నీటి సరఫరాతో పాటు, సీవరేజ్‌ పనులు, రింగ్‌ రోడ్‌ను మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలి. చేపట్టిన ఏ పని అయినా, దీర్ఘకాలం ఉండేలా చేయాలి. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని’’ సీఎం సూచించారు.

ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు:
వేంపల్లిలో రూ.92 కోట్లతో భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) పనులకు ఆమోదం.
పనులు చేసినప్పుడు కూడా మొత్తం ఒకేసారి మొదలు పెట్టకుండా, దశల వారీగా చేయండి. 
అంతటా ఒకేసారి గుంతలు తవ్వి పనులు చేపడితే, అవి పూర్తయ్యే సరికి చాలా టైమ్‌ పట్టి, మొత్తం గుంతలే కనిపిస్తాయి.
కాబట్టి ఒక దగ్గర పని మొదలు పెట్టి.. ఆ పని పూర్తి చేసి, ఆ తర్వాత మరో దశకు వెళ్లండి.

ఆలయాలు–అభివృద్ధి:
గండి క్షేత్రం వీరాంజనేయ స్వామి ఆలయంలో రూ.21 కోట్లతో పనులు. 
24 దేవాలయాల పునర్నిర్మాణంతో పాటు, కొత్తగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 26 ఆలయాల నిర్మాణం.

ఇంకా..
తొండూరులో బాలికల బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు.
పులివెందుల, వేంపల్లిలో రైతు బజార్లు, పులివెందులలో క్రికెట్‌ స్టేడియమ్‌ నిర్మాణం.
కడపలో క్రికెట్‌ స్టేడియమ్‌లో ఫ్లడ్‌ లైటింగ్‌ వ్యవస్థ పనులకు శ్రీకారం.
కడపలో రైల్వే స్టేషన్, రిమ్స్‌ రోడ్ల అభివృద్ధి.
నగరంలో అత్యంత ప్రధానమైన 4 రహదారులను రూ.217 కోట్ల వ్యయంతో తొలి దశలో అభివృద్ధి.
కడప విమానాశ్రయంలో నైట్‌ ల్యాండింగ్‌ జరిగేలా రన్‌ వే విస్తరణ.
అందు కోసం 47 ఎకరాల భూసేకరణ చేసి ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించాలి.

బుగ్గవంక ప్రొటెక్షన్‌ వాల్‌:
బుగ్గవంక ప్రాంతంలో 10 కి.మీ ప్రొటెక్షన్‌ వాల్‌కు గానూ, వైయస్సార్‌ హయాంలో 7 కి.మీ పూర్తి. 
మిగిలిన 3 కి.మీ ప్రొటెక్షన్‌ వాల్‌ నిర్మాణంతో పాటు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థకు అదనంగా రూ.50 కోట్లు మంజూరు.

24న ఇర్మా–ఏపీ:
రాష్ట్రంలో ఇర్మా–ఏపీ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్‌–ఏపీ) ఏర్పాటు.
ఈనెల 24న సంస్థ ఏర్పాటుకు శిలా ఫలకం ఆవిష్కరణ.
పులివెందులలోని ఏపీ–కార్ల్‌ సంస్థలో ఇర్మా–ఏపీ ఏర్పాటు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top