విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యశ్రీ బంద్ కానుంది. బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు రూ.3 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. బకాయిల కోసం ఎన్నిసార్లు తిరిగినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ఆశ నిర్ణయం తీసుకుంది. బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తామని ఆశ అల్టిమేటం జారీ చేసింది.
పెండింగ్లో ఉన్న బకాయిలు ఇవ్వకపోతే ఆరోగ్యశ్రీని ఆపేస్తామని చంద్రబాబుకి అల్టిమేటం ఇవ్వడం ఇది తొలిసారి కాదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ASHA) ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని అనేకసార్లు ప్రకటించింది. ముఖ్యంగా 2025లో కనీసం మూడు ప్రధాన సందర్భాల్లో ఈ ప్రకటనలు జరిగాయి, పెండింగ్ బకాయిలు వేల కోట్లలో ఉండటమే ఇందుకు కారణం.
గతంలోనూ ఇటువంటి హెచ్చరికలు వచ్చినా మళ్లీ ఇటువంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ఈ స్కీమ్లో భాగస్వామ్యం కాబోమని గతంలోనూ పలు ఆసుపత్రులు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పాయి.


