జిల్లాకు పాకిన స్క్రబ్ టైఫస్
అనంతపురం మెడికల్: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి జిల్లాకు పాకింది. పలువురికి పాజిటివ్ కేసులు నమోదవడం జిల్లాను కలవరపెడుతోంది. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని మెడిసిన్ విభాగంలో 12 ఏళ్ల బాలిక (తాళ్లకెర), గైనిక్ వార్డులో 16 ఏళ్ల బాలిక (ముదిగుబ్బ) అడ్మిషన్లో ఉన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. స్క్రబ్ టైపస్ కేసులకు ప్రత్యేక వార్డును కేటాయిస్తే బాగుంటుందని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలోనూ కొందరికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెల్సింది. కానీ ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని తొక్కిపెట్టింది. ఇటీవల ఇటువంటి కేసులు అధికమవుతుండడంతో జిల్లా అధికార యంత్రాంగం కేసులు అధికం కాకుండా, స్క్రబ్ టైఫస్ లక్షణాలున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.
కుడి కాలువ గేట్లు దించారు
కూడేరు: జల్లిపల్లిలో 4వ కిలో మీటర్ వద్ద తెగిన పీఏబీఆర్ కుడి కాలువ గట్టుకు తక్షణమే మరమ్మతులు చేపట్టేందుకు ఇరిగేషన్ జేఈఈలు ఓబులరెడ్డి, లక్ష్మీదేవి, సుబ్రహ్మణ్యం మంగళవారం ధర్మవరం కుడికాలువ గేట్లు కిందికి దించేశారు. గేట్లు దించకపోతే 600 క్యూసెక్కుల నీరు వృథాగా మిడ్ పెన్నార్కు చేరుతాయి. కుడి కాలువ గేట్లు ముట్టుకుంటే మొరాయించి మళ్లీ పైకి లేవవని తెలిసినప్పటికీ గత్యంతరం లేక గేట్లు దించేశారు. అయినప్పటికీ లీకేజీ రూపంలో 150 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతున్నాయి. పీఏబీఆర్ 4, 6, 7 గేట్ల స్పిల్వే ద్వారా మాత్రమే 660 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న మిడ్ పెన్నార్కు వదులుతున్నారు. మరో రెండు రోజుల్లో తెగిన కుడి కాలువ గట్టుకు మరమ్మతులు చేపట్టనున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మంగళవారం నాటికి డ్యాంలో 5.21 టీఎంసీల నీరు నిల్వ ఉంది. హెచ్చెల్సీ ద్వారా 160, జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవా కాలువ ద్వారా 570 క్యూసెక్కులు వచ్చి డ్యాంలోకి చేరుతోంది. అవుట్ 1000 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
బీఫార్మసీ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్టీయూ(ఏ) పరిధిలో నవంబర్లో నిర్వహించిన బీఫార్మసీ నాలుగో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–19) రెగ్యులర్, సప్లిమెంటరీ, బీఫార్మసీ నాలుగో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–15) సప్లిమెంటరీ, రెండో సెమిస్టర్ (ఆర్–19, ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు విడుదల చేశారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ శంకర శేఖర్రాజు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ అంకారావు పాల్గొన్నారు. ఫలితాలను జేఎన్టీయూ అనంతపురం యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని సూచించారు.
నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ.1.06 కోట్లు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ. 1.06 కోట్ల ఆదాయం లభించినట్లు ఈఓ ఎం.విజయరాజు తెలిపారు. మంగళవారం ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు చేపట్టారు. 106 రోజులకు గాను రూ.1,06,88,365 నగదు, అన్నదాన హుండీ ద్వారా రూ.45,330 నగదును భక్తులు స్వామివారికి సమర్పించినట్లు ఈఓ తెలిపారు. 0.024 గ్రాముల బంగారు, 1.450 కిలోల వెండితోపాటు 13 డాలర్ల విదేశీ కరెన్సీ, 5 దినామ్స్ను భక్తులు స్వామివారికి సమర్పించినట్లు వెల్లడించారు. దేవదాయశాఖ జిల్లా అధికారి బోయపాటి సుధారాణి, ఆలయ ఏఈవో వెంకటేశ్వర్లు ఇతర సిబ్బంది, పోలీస్ సిబ్బంది, తదితరులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన వీరభద్రసేవా సమితి, హనుమాన్ సేవా సమితి, రాఘవేంద్ర సేవా సమితి, శ్రీరామ సేవాసమితి సభ్యులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లాకు పాకిన స్క్రబ్ టైఫస్


