గంగవరంలో ఘోరం
బెళుగుప్ప: గంగవరంలో ఘోరం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో రెండు గుడిసెలు దగ్ధమైన ఘటనలో ఓ మహిళ సజీవ దహనమైంది. మరో ఇద్దరు కుటుంబ సభ్యులు గాయాలతో బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. గంగవరం సమీపంలోని తోటలో ఎగువపల్లి గంగమ్మ (55), నరసన్న దంపతులు జమ్ముతో రెండు గుడిసెలు వేసుకుని, తమ కుమారుడు ఎర్రిస్వామి, కోడలు వాణి, మనవడు అనంతసాయితో కలసి నివాసం ఉంటున్నారు. వాణి ప్రసవం కోసం ఇటీవల ఉరవకొండలోని పుట్టింటికి వెళ్లింది. సోమవారం రాత్రి ఎర్రిస్వామి కుమారుడు అనంతసాయితో కలిసి ఒక గుడిసెలో నిద్రించాడు. మరో గుడిసెలో గంగమ్మ పడుకుంది. ఆమె భర్త నరసన్న మేకలకు కాపలాగా ఆరుబయట నిద్రించాడు. గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి క్షణాల్లో మంటలు అలుముకున్నాయి. గంగమ్మ బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో మంటల్లో చిక్కుకుపోయి కాలిపోయింది. ఆరుబయట ఉన్న నరసన్న గమనించి గట్టిగా కేకవలు వేయడంతో పక్క గుడిసెలో నిద్రిస్తున్న ఎర్రిస్వామి, అనంతసాయి లేచి చుట్టుముట్టిన మంటల్లోంచి ఎలాగోలా బయటకు వచ్చి గాయాలతో బయటపడ్డారు. అయితే గంగమ్మ సజీవదహనమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గుడిసెల్లోని నిత్యావసర వస్తువులు, వ్యవసాయ పరికరాలు కాలిపోవడంతో రూ.5లక్షల దాకా నష్టం వాటిల్లింది. బాధితుడు ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ తెలిపారు. మంగళవారం ఉదయం సంఘటన స్థలాన్ని ఫొరెన్సిక్ బృందంతో పాటు పోలీసులు పరిశీలించారు.
షార్ట్ సర్క్యూట్తో రెండు గుడిసెలు దగ్ధం
మంటల్లో చిక్కుకుని మహిళ సజీవ దహనం
గాయాలతో బయటపడిన కుటుంబ సభ్యులు
గంగవరంలో ఘోరం


