రైతాంగాన్ని ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రైతాంగాన్ని ఆదుకోవాలి

May 28 2025 11:41 AM | Updated on May 28 2025 11:41 AM

రైతాంగాన్ని ఆదుకోవాలి

రైతాంగాన్ని ఆదుకోవాలి

అనంతపురం కార్పొరేషన్‌: ‘ఖరీఫ్‌, రబీకి సంబంధించి ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ ఇవ్వకపోవడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఖరీఫ్‌ సీజన్‌ దగ్గర పడుతున్నా ఇంత వరకు విత్తన కేటాయింపులు జరపలేదు. ప్రజాప్రతినిధులు స్వార్థ రాజకీయాలు వీడి రైతాంగాన్ని ఆదుకోవాలి’ అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023–24 ఖరీఫ్‌లో 17 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారని, కేంద్ర బృందం పర్యటించి వెళ్లినా ఇన్సూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. 2024 ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పెద్ద ఎత్తున పంటలు నష్టపోయినా కేవలం 7 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారన్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 15 లక్షల ఎకరాలకు పైబడి పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేసినట్లు తెలిపారు. ఇందు కోసం 3.11 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం కేవలం 1.14 లక్షల క్వింటాళ్లను కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు.

ఒక్క రూపాయి ఇచ్చారా?

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం కింద రైతుకు రూ.13,500 చొప్పున అందజేశామని ‘అనంత’ గుర్తు చేశారు. అప్పట్లో సున్నావడ్డీ, పావలా వడ్డీ వచ్చేవన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి, ఇంత వరకు ఒక్క రూపాయి ఇవ్వకుండా మోసం చేశారన్నారు. సున్నా, పావలా వడ్డీ అందే పరిస్థితి లేదన్నారు. బ్యాంకు రుణాలను రెన్యూవల్‌ చేయడం లేదన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న ఉచిత పంటల బీమాను కూటమి ప్రభుత్వం తొలగించిందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమయ్యే సమయంలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ ఒక్క సమీక్ష అయినా చేశారా అని ప్రశ్నించారు. ఇటీవల జెడ్పీ సమావేశంలో రైతు సమస్యలను ప్రస్తావించిన పాపాన పోలేదన్నారు. ‘ఆ ఫొటో ఇక్కడుండాలి, ఈ ఫొటో అక్కడుండాలి’ అని అనుకోవడానికే సమయం సరిపోయిందన్నారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. రైతులకు ఎటువంటి మేలు జరగడం లేదన్నారు. అధిక ధరలకు ఎరువుల అమ్మకాలు చేస్తున్నా విజిలెన్స్‌ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గత ఏడాది డీఏపీ, యూరియా, పొటాష్‌ కృత్రిమ కొరత సృష్టించారని, బస్తాపై రూ.30 నుంచి రూ.50 వరకు అధికంగా అమ్ముకున్నారని, ఈ ఏడాదీ అదే పరిస్థితి ఉందన్నారు. రైతులు అష్ట కష్టాలు పడుతుంటే ప్రజాప్రతినిధుల దృష్టంతా ఆదాయం, వ్యాపారాలపైనే ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీలను, తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని విమర్శించడం తప్ప మరేమీ చేయడం లేదన్నారు. అసలు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఉన్నారా అనే పరిస్థితి ఉందన్నారు. తక్షణం సీఎంతో మాట్లాడి ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజాస్వామ పద్ధతిలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్‌ రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌, రైతు విభాగం అనంతపురం నియోజకవర్గం అధ్యక్షుడు నాగేశ్వర్‌ రెడ్డి, కార్పొరేటర్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement