
‘మార్కెటింగ్’లో మిశ్రమ ఫలితాలు
అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమైన 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొదటి నెలకు సంబంధించి నిర్ధేశిత పన్ను వసూళ్లలో మార్కెటింగ్శాఖ మిశ్రమ ఫలితాలు సాధించింది. గతానికి భిన్నంగా ఈసారి ఉరవకొండ మార్కెట్ కమిటీ దూకుడు కొనసాగించగా... గుత్తి, తాడిపత్రి, రాప్తాడు తదితర ఐదారు కమిటీలు వెనుకంజలో ఉన్నాయి. జిల్లాలోని 9 మార్కెట్ కమిటీలు, 15 చెక్పోస్టుల ద్వారా ఈ ఏడాది రూ.13.49 కోట్ల వసూళ్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా... మొదటి నెల ముగిసేనాటికి ఓవరాల్గా 10.2 శాతంతో రూ.1.38 కోట్లకు పైగా ప్రగతి సాధించడం గమనార్హం. గతేడాది మొదటి నెలతో పోల్చుకుంటే ఈసారి రూ.19.21 లక్షలు అధికంగా వసూలైనట్లు మార్కెటింగ్శాఖ ఏడీ పి.సత్యనారాయణచౌదరి తెలిపారు. మార్కెట్ కమిటీల్లో విజిలెన్స్ చర్యలు మరింత పటిష్టం చేసి లీకేజీలు లేకుండా గడువులోపు వంద శాతం సాధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఫారంపాండ్ల నిర్మాణాలు పూర్తి చేయండి
అనంతపురం టౌన్: ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన 10,413 ఫారం పాండ్ల నిర్మాణాలను జూన్ మొదటి వారంలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను డ్వామా పీడీ సలీంబాషా ఆదేశించారు. ఫారం పాండ్ల నిర్మాణాలపై శుక్రవారం ఏపీడీలు, ఏపీఓలతో ఆయన టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలోని ప్రతి మండలంలో 335 ఫారం పాండ్ల తవ్వకాలు చేపట్టాలన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 1,166 ఫారంపాండ్లు పూర్తి కాగా 3 వేల ఫారం పాండ్లు వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనులు నిర్దేశిత సమయంలోపు పూర్తి కావాలని ఆదేశించారు.
బీసీ గురుకులాల
కన్వీనర్గా అష్రత్వలి
అనంతపురం ఎడ్యుకేషన్: మహాత్మ జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల కన్వీనర్గా కొనకొండ్ల గురుకుల పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు జి.అష్రత్వలి నియమితులయ్యారు. ప్రస్తుతం కన్వీనర్గా పనిచేస్తున్న కేజే జోనాథన్ గత నెల 29న పదవీవిరమణ పొందారు. ఈ క్రమంలో అష్రత్వలికి జిల్లా కన్వీనర్గా నియమించారు.