
ఆర్డీటీ పరిరక్షణకు ఎందాకై నా..
అనంతపురం సిటీ: దళిత, గిరిజన వర్గాలతో పాటు మహిళలు, విద్యార్థులు, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) సంస్థకు విదేశీ నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా ఆర్డీటీ పరిరక్షణకు ఉద్యమిస్తామిస్తామంటూ ముక్తకంఠంతో నినదించారు. ఆర్డీటీకి అందుతున్న విదేశీ నిధులపై విధించిన ఆంక్షలపై నిరసిస్తూ, ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ అంశంపై చేపట్టాల్సిన భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై అనంతపురంలోని జిల్లా పరిషత్ క్యాంపస్లో గల డీపీఆర్సీ భవన్లో సోమవారం సదస్సు జరిగింది. సీపీఐ నేత డి.జగదీష్ అధ్యక్షత వహించగా, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, కంబదూరు జెడ్పీటీసీ సభ్యుడు గుద్దెళ్ల నాగరాజు, వీకే ట్రస్ట్ చైర్మన్ వీకే రంగారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రతినిధి నాగరాజు, మానవ హక్కుల ప్రతినిధి బాషా, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, రైతు సంఘం ప్రతినిధి కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధి కేశవరెడ్డి, అనంతపురం రూరల్ మాజీ ఎంపీపీ ఆలమూరు శ్రీనివాసరెడ్డి, అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్ సహా పలు ప్రజా, కుల సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి,
ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా..
దుర్భిక్ష ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో ప్రభుత్వాలు చేయలేని ఎన్నో విలువైన సేవలను నిస్వార్థంతో ఆర్డీటీ చేసిందని, ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా ఆర్డీటీకి గుర్తింపు ఉందని వక్తలు అన్నారు. స్పానిష్ ఆర్మీలో సైనికుడిగా పని చేసిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ మానవత్వానికి హద్దుల్లేవని నిరూపించారన్నారు. తన నిస్వార్థ సేవలతో ఎస్సీ, ఎస్టీలతో పాటు సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, దళిత, గిరిజన వాడల అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. విద్య, వైద్యం అందించడంతో పాటు ప్రజలను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతమయ్యేలా చైతన్యం తీసుకురావడంలో ఆయన సఫలీకృతులయ్యారని కొనియాడారు. ఆయన మరణానంతరం కూడా సతీమణి అన్నే ఫెర్రర్, కుమారుడు మాంఛో ఫెర్రర్, కోడలు విశా ఫెర్రర్ సామాజిక సేవలను కొనసాగిస్తుండడం, మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం గర్వంగా ఉందన్నారు. లక్షలాది మంది ప్రజల జీవితాలతో ముడి పడిపోయిన ఆర్డీటీకి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్సీఆర్ఏ) రిజిస్ట్రేషన్ పునరుద్ధరించకపోతే నష్టపోయేది పేదలేనని ఆందోళన వ్యక్తం చేశారు.
పేదలతో కలసి పార్టీలకతీతంగా ఐక్య పోరాటాలకు సిద్ధం
ఎఫ్సీఆర్ ఏ రిజిస్ట్రేషన్
పునరుద్ధరించాలని డిమాండ్
ఏ పోరాటానికై నా సిద్ధం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిస్వార్థ సేవలందిస్తూ నిరుపేదల జీవితాల్లో అంతర్భాగమైన ఆర్డీటీ మనుగడ ప్రస్తుతం ప్రమాదంలో పడింది. ప్రభుత్వాలు చేయలేని ఎన్నో మంచి పనులను ఆర్డీటీ చేసి చూపించింది. అలాంటి సంస్థ కోసం పార్టీలకతీతంగా పేదలతో కలసి ఐక్య పోరాటాలకు సిద్ధం, ఆర్డీటీని కాపాడుకోవడమే లక్ష్యం. – బోయ గిరిజమ్మ,
జెడ్పీ చైర్పర్సన్, అనంతపురం
మానవత్వంతో ఆలోచించాలి
కుల, మతాలు, రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తున్న ఆర్డీటీకి అందరూ అండగా నిలవాలి. 1969 నుంచి ఇప్పటి వరకూ దళిత, గిరిజనులతో పాటు మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి ఆర్డీటీ దోహదపడుతూ వస్తోంది. వెనుకబడిన ప్రాంతాలకు వరదాయినిగా మారిన ఆర్డీటీ ఉనికి ప్రశ్నార్థకం కాకూడదు. నిధులు అందేలా కేంద్రం చొరవ తీసుకోవాలి.
– విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ
అండగా నిలబడాలి
ఆర్డీటీని కాపాడుకునేందుకు ప్రజలందరితో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కలసి రావాలి. జిల్లాలో ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా ఎంతో మంది జీవితాలను నిలబెట్టిన ఆర్డీటీకి అండగా నిలవాల్సిన తరుణమిదే. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. ఆర్డీటీకి నిధులు అందేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
– వీకే రంగారెడ్డి, వీకే ట్రస్ట్ చైర్మన్, అనంతపురం
ప్రజల జీవనాడి ఆర్డీటీ
అనంత జిల్లా ప్రజల జీవనాడిగా ఆర్డీటీ మారిపోయింది. 1969లో స్థాపించిన ఈ సంస్థ 1970 నుంచి విస్తృతమైన సేవలందిస్తోంది. కరోనా సమయంలో ఆ సంస్థ అందించిన సేవలను ఏ ఒక్కరూ జీవితంలో మరచిపోలేరు. ఆర్డీటీపై దుష్ప్రచారం తగదు. పేదల జీవనోపాధుల మెరుగు కోసం ఆర్టీటీకి అండగా నిలవాలి.
– ఓ.నల్లప్ప, సీపీఎం జిల్లా కార్యదర్శి, అనంతపురం

ఆర్డీటీ పరిరక్షణకు ఎందాకై నా..

ఆర్డీటీ పరిరక్షణకు ఎందాకై నా..

ఆర్డీటీ పరిరక్షణకు ఎందాకై నా..

ఆర్డీటీ పరిరక్షణకు ఎందాకై నా..

ఆర్డీటీ పరిరక్షణకు ఎందాకై నా..