
తాగునీటి పథకం కార్మికుల గోడు పట్టని సీఎం
కూడేరు: తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికుల గోడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టడం లేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు మండిపడ్డారు. బకాయి వేతనాలు, ఫీఎప్ చెల్లింపులు తక్షణమే చేయాలంటూ సోమవారం కూడేరు మండలం పీఏబీఆర్ వద్ద ఉన్న శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ వద్ద కార్మికులు పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడారు. తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆరు నెలలుగా వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిన కార్మికులకు అండగా నిలవాలంటూ సీఎంకు పోస్టు కార్డులు రాసి పోస్టు చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్రిస్వామి, కార్మికులు రామాంజనేయులు, కొండారెడ్డి,వన్నూరు స్వామి, తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు