
జోధ్పూర్ తరహాలో మొక్కల పెంపకం
● ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ షణ్ముఖకుమార్
బొమ్మనహాళ్/కణేకల్లు: ‘రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ ప్రాంతంలో సున్నితమైన ఇసుకలో అత్యంత తక్కువ సామర్థ్యం నీటితో అక్కడి రైతులు పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఆ తరహాలోనే బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లోని ఇసుక దిబ్బల్లో పండ్ల మొక్కలు పెంచేందుకు రైతులను ప్రోత్సహిస్తాం’ అని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ వై.వి.కే షణ్ముఖ కుమార్ అన్నారు. శుక్రవారం బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లోని దర్గాహొన్నూరు, మాల్యం, నాగేపల్లి, తుంబిగనూరు గ్రామాల్లో షణ్ముఖ కుమార్, అడిషనల్ కమిషనర్ కమిషనర్ శివప్రసాద్, చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి గోపీ చంద్, అనంతపురం డ్వామా పీడీ సలీమ్బాషా, ఎంపీడీఓ విజయభాస్కర్, ఈఓపీఆర్డీ దాస్, ఏఓ సాయికుమార్ పర్యటించారు. ఇటీవల జోధ్పూర్ ప్రాంతంలో రాష్ట్ర కమిటీ పర్యటించి అధ్యయనం చేసిందని డైరెక్టర్ షణ్ముఖకుమార్ తెలిపారు. ఇసుక దిబ్బల్లో పర్యటిస్తూ కొందరు రైతులు సాగు చేసిన పండ్ల మొక్కలను పరిశీలించి రైతులతోనూ మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఇసుక దిబ్బల్లో ఏఏ పంటలు సాగుకు అనువైనవి అనే విషయంపై పరిశీలన చేసి ఈ ఏడాది నుంచే రైతులకు పండ్ల మొక్కల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి ఉపాధి పథకం ద్వారా మొక్కలు అందిస్తామని, ఎక్కువ భూములు ఉన్న రైతుల వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.