
ఎన్సీడీసీ రుణాల రికవరీ పెరగాలి
అనంతపురం అగ్రికల్చర్: నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘాల సభ్యులు తీసుకున్న రాయితీ రుణాల రికవరీ పెరిగితే... కొత్తగా రుణ ప్రతిపాదనలు పంపిస్తామని షీప్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి అన్నారు. స్థానిక పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న షీప్ యూనియన్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఉమ్మడి జిల్లా మహాజన సభలో ఈ అంశంపై చాలా సేపు చర్చ సాగింది. ఈడీ కేఎల్ శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన మహాజనసభలో పర్సన్ ఇన్చార్జి హోదాలో డీడీ డాక్టర్ వై.రమేష్రెడ్డి, అలాగే పశుశాఖ జేడీ డాక్టర్ జీపీ వెంకటస్వామి, సహకార అధికారి మురళి తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్సీడీసీ నుంచి రూ.10 కోట్ల వరకు రుణాలు అందించామని, గడువు మీరినా ఇంకా రూ.2.50 కోట్ల రుణాల వసూళ్లు పెండింగ్లో ఉన్నందున కొత్తగా రుణాల మంజూరుకు అవరోధం ఏర్పడుతోందన్నారు. ఇది ఆర్థికంగా పురోగతి సాధించాలనుకున్న గొర్రెలు, మేకల సహకార సంఘాల సభ్యులకు ఇబ్బందిగా మారుతోందన్నారు. అనంతరం పెండింగ్ రుణాలు సాధ్యమైనంత తొందరగా చెల్లించాలని లేదంటే అవసరమైన చర్యలు తీసుకునేలా సభ ఆమోదం తెలిపింది. జిల్లా సమాఖ్య పాలకవర్గం ఏర్పాటుకు ఎన్నికలు నిర్వహించాలని దీనిపై ఈడీ నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. గొర్రెలు, మేకల పెంపకంపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నందున ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని జేడీ వెంకటస్వామి తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏర్పడిన పాలక వర్గాల అధ్యక్షులు, సభ్యులను పరిచయం చేసుకుంటూ... రిజిస్టర్లు, సమావేశాలు, ఆడిటింగ్ నిర్వహణ అంశంపై అవగాహన కల్పించారు.
షీప్ యూనియన్ మహాజన సభలో చర్చ