
ప్రభుత్వ కార్యాలయం.. ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం
అనంతపురం అగ్రికల్చర్: ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఔట్సోర్సింగ్ అంతకన్నా కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా కాదు. కానీ ప్రభుత్వ కార్యాలయంలో దర్జాగా కంప్యూటర్ ముందు కూర్చొని తన పని తాను చేసుకుంటున్నాడు. ఎవరని అడిగితే ప్రైవేట్ డ్రిప్ కంపెనీలో పనిచేస్తున్నాడట! ఏమి చేస్తున్నావంటే? ఏమీ లేదంటూనే... సీరియస్గా కంప్యూటర్లో వివరాలు నమోదు చేసుకోసాగాడు. బుధవారం ఉదయం సరిగ్గా 10.30 గంటలకు స్థానిక ఏపీ మైక్రో ఇరిగేషన్ ఆఫీసు (ఏపీఎంఐపీ) కార్యాలయంలో ఈ చోద్యం వెలుగు చూసింది. ఉదయం 10.45 గంటల నుంచి 11 గంటల మధ్య పీడీ, ఏపీడీ, సూపరింటెండెంట్, మైక్రో ఇంజనీర్లు, ఎంఐఏఓలు, క్లరికల్ స్టాఫ్ ఒక్కొక్కరూ కార్యాలయానికి వచ్చారు. అప్పటి వరకూ అతను కంప్యూటర్ను వదలకుండా అందులోని మొత్తం సమాచారాన్ని నోట్ చేసుకోవడం గమనార్హం. ఇతనొక్కడే కాదు అప్పుడప్పుడు ప్రైవేట్ వ్యక్తులు కొందరు కార్యాలయానికి చేరుకుని అధికారుల సీట్లలో దర్జాగా కూర్చొని వారి కంప్యూటర్లలోని సమాచారాన్ని తెలివిగా అపహరించుకెళుతున్నట్లుగా తెలిసింది.