
క్రీడల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తున్న వీసీ జింకా రంగజనార్దన
● జేఎన్టీయూఏ వీసీ రంగజనార్దన ఆశాభావం
● అట్టహాసంగా ఇంజినీరింగ్ కళాశాల 76వ వార్షికోత్సవం
● క్రీడల్లో ప్రతిభ చాటే వారికి నెలకు రూ.10 వేల ఉపకారవేతనం
అనంతపురం: మానవ వనరులు అపారంగా ఉండి జాతి పురోగతికి విశేషంగా కృషి చేస్తున్న యువశక్తిశీల దేశంగా భారత్ విరాజిల్లుతోందని జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన అన్నారు. జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల 76వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం స్పోర్ట్స్డే నిర్వహించారు. అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.సుజాత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి వీసీ మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ చాటి స్వర్ణం, రజతం, కాంస్య పతకాలు గెలుపొందే విద్యార్థులకు రూ.25 వేలు ప్రోత్సాహక బహుమతితో పాటు నెలకు రూ.10 వేల ఉపకార వేతనం అందిస్తామన్నారు. 2047 నాటికి భారత్ అగ్రరాజ్యంగా ఏర్పడి విశ్వగురుగా గుర్తింపు దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ, దక్షిణ భారత అంతర్ వర్సిటీ స్థాయి పోటీల్లో గత విద్యా సంవత్సరంలో 25 మంది విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటారన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.శశిధర్ మాట్లాడుతూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నిచోట్లా జేఎన్టీయూ విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటారన్నారు. క్రీడలను కెరీర్గా ఎంచుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. స్పోర్ట్స్ సెక్రెటరీ డాక్టర్ జోజిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. భవానీ, జనరల్ కెప్టెన్ అమృత్రాజ్ పాల్గొన్నారు.
సామాజిక ఆవిష్కరణలు కావాలి
ఇంజినీర్లు సమాజానికి దోహదపడే ఆవిష్కరణలు చేపట్టాలని జేఎన్టీయూఏ వీసీ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన సూచించారు. జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల 76వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం తొలిసారిగా టెక్ ఫెస్ట్ –2కే23 నిర్వహించారు. సివిల్ ఇంజినీరింగ్లో రేస్ 2కే23, ఎలక్ట్రికల్ విభాగం ఐ–2కే23, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం డైనమిక్స్ 2కే23, ఎలక్ట్రానిక్స్ విభాగం ఈ–మెర్జ్2కే23, కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో పిక్సెల్ 2కే23, కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ఫ్యూసన్2కే23 సదస్సులు నిర్వహించారు. సదస్సులకు ముఖ్య అతిథిగా వీసీ హాజరై మాట్లాడారు. టెక్ఫెస్ట్–23 సదస్సుల ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయవచ్చన్నారు. సమస్యలను పరిష్కరించే రీతిలో నూతన అంశాలు తెలుసుకోవడానికి ఇలాంటి వేదిక దోహదపడుతుందన్నారు. విశిష్ట అతిథి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.శశిధర్ మాట్లాడుతూ భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం అనివార్యమని స్పష్టం చేశారు. ఇలాంటి అంశాలపై నూతన ఆవిష్కరణలు చేయాలని కోరారు. అనంతరం వివిధ విభాగాల్లో సావనీర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుజాత, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.భవాని తదితరులు పాల్గొన్నారు.
