మాడుగుల : మాడుగుల మోదకొండమ్మ ఘటాలు ఊరేగింపు మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. డప్పులు వాయిద్యాలతో మహిళా కోలాటాలు నడుమ అమ్మవారి ఊరేగింపు కన్నుల పండువగా జరిగింది. ముందుగా అమ్మవారి ప్రతి రూపమైన ఘటాలను ఆలయ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, కమిటీ సభ్యుడు దేవరాపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు శిరస్సున పెట్టుకుని సతకం పట్టు వద్దకు అడుగులు వేశారు. అనంతరం వేలాది మంది భక్తులు అమ్మవారి ఘటాలు శిరస్సున పెట్టుకుని సంబరంలో పాల్గొన్నారు. ఆలయం నుంచి సతకం పట్టు వద్దకు భారీ మందుగుండు సామగ్రి, కోలాటాలు, నడుమ సతకం పట్టు వద్దకు సంబరంగా చేరుని అక్కడే కొలువు దీరారు. జూన్ 2వ తేదీ వరకు అమ్మవారు అక్కడే దర్శన మిస్తారు. తిరిగి పండగ రోజు మరలా ఆలయానికి చేరుకోవడంతో అమ్మవారి నెల రోజుల పండగ పూర్తి అవుతుంది. అమ్మవారు గ్రామంలో కోట ప్రాంగణంలో ఉన్న సతకం పట్టు వద్దకు చేరగానే అంతవరకు మండుటెండలో ఉన్న వాతావరణం ఇక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. దీంతో మాడుగుల ప్రజలు అమ్మవారి మహిమగా భావించి ఆనందం వ్యక్తం చేశారు.


