మెట్రో.. ఎటో? | - | Sakshi
Sakshi News home page

మెట్రో.. ఎటో?

Mar 28 2026 7:33 AM | Updated on Mar 28 2026 7:33 AM

ఇదేం డీపీఆర్‌ ‘బాబూ’.. అని కేంద్ర మంత్రిత్వ శాఖల పెదవి విరుపు డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ ఎందుకంటూ సందేహాలు మరోసారి డీపీఆర్‌లో మార్పులు చెయ్యాలంటూ ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కి ఆదేశాలు వైఎస్సార్‌ సీపీ హయాంలో సమగ్ర డీపీఆర్‌ చంద్రబాబు అతి విజనరీ వల్ల మళ్లీ మొదటికి వైజాగ్‌ మెట్రోకథ

సాక్షి, విశాఖపట్నం : విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఇప్పుడు ఆ ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. గత ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రణాళికలను పక్కనపెట్టి, కేవలం తన మార్కు కనిపించాలన్న తాపత్రయంతో చంద్రబాబు ప్రవేశపెట్టిన ‘డబుల్‌ డెక్కర్‌’ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రిత్వ శాఖలు గట్టి షాక్‌ ఇచ్చాయి. కొత్తగా పంపిన డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపడంతో విశాఖ వాసుల మెట్రో కల మళ్లీ మొదటికి వచ్చింది. వాస్తవానికి గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం విశాఖ అభివృద్ధిని కాంక్షిస్తూ 76 కిలోమీటర్ల మేర 4 కారిడార్లతో లైట్‌ మెట్రో ప్రాజెక్టుకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసింది. రూ. 14,309 కోట్ల అంచనా వ్యయంతో, పీపీపీ విధానంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2023 డిసెంబర్‌ 29న ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, విదేశీ డిజైన్లు, డబుల్‌ డెక్కర్‌ కారిడార్లంటూ ‘విజనరీ’ పేరుతో కొత్త డీపీఆర్‌ను రూపొందించారు. కేవలం 8 కిలోమీటర్ల డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ కోసం పూర్తిస్థాయిలో ఉన్న పాత డీపీఆర్‌ను మార్చేయడం ఇప్పుడు విమర్శలకు దారితీసింది. ఈ కొత్త ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం ‘డబుల్‌ డెక్కర్‌ వస్తే ఇక మెట్రోతో పనేముంది?’ అని ప్రశ్నిస్తూ డీపీఆర్‌ను తిరస్కరించింది. ‘ఇదేం డీపీఆర్‌ బాబూ?’ అంటూ కేంద్రం అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

సాంకేతిక అడ్డంకులు – కేంద్రం తిరస్కరణ

కేంద్ర మంత్రిత్వ శాఖల విశ్లేషణ ప్రకారం.. డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ వల్ల నిర్మాణ సమయం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న ట్రాఫిక్‌ సాంద్రత, భూసేకరణ సమస్యలు ఈ కొత్త ప్రతిపాదనతో మరింత జటిలమవుతాయి. ఈ నేపథ్యంలో ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ డబుల్‌ డెక్కర్‌ ప్రతిపాదనను తొలగించి, పాత పద్ధతిలోనే సాధ్యమయ్యే రీతిలో మరోసారి కొత్త డీపీఆర్‌ తయారు చేయాలని తేల్చి చెప్పింది. దీనివల్ల నెలల తరబడి కష్టపడి చేసిన కసరత్తు అంతా బూడిదలో పోసిన పన్నీరైంది.

ముగింపు..మళ్లీ మొదటికే కథ!

మొత్తానికి విశాఖ మెట్రో కథ ఇప్పుడు ‘మళ్లీ మొదటికి’ అన్నట్లు తయారైంది. కేంద్రం ఆదేశాల మేరకు కొత్త డీపీఆర్‌ తయారు చేయాలంటే మళ్లీ కొన్ని నెలల సమయం పడుతుంది. అప్పటివరకు నిధుల కేటాయింపు, టెండర్ల ప్రక్రియ ఆగిపోవాల్సిందే. ప్రభుత్వాల ప్రాధాన్యతలు మారినప్పుడల్లా ఇలా ప్రాజెక్టు నివేదికలు మారిపోతే, సామాన్యుడికి మెట్రో ప్రయాణం ఎప్పటికీ ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

డబుల్‌ డెక్కర్‌తోనే అసలు సమస్య

విశాఖ మెట్రో కోసం గత ప్రభుత్వం సిద్ధం చేసిన లైట్‌ మెట్రో డీపీఆర్‌ బాగుందని కేంద్రం చెప్పినా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టుబట్టి పంపిన ‘డబుల్‌ డెక్కర్‌’ ప్రతిపాదనలు ఇప్పుడు ప్రాజెక్టును గందరగోళంలోకి నెట్టాయి. 12 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిశీలనకు వెళ్లిన ఈ కొత్త డీపీఆర్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ముఖ్యంగా డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ ఉంటే మెట్రోకు రావాల్సిన ట్రాఫిక్‌ తగ్గిపోతుందని, ఇది ప్రాజెక్టు మనుగడకే ముప్పని కేంద్రం స్పష్టం చేసింది. ‘అసలు ఈ డీపీఆర్‌ మెట్రో అభివృద్ధి కోసమేనా?’ అని పలు శాఖలు సందేహాలు లేవనెత్తడంతో, ఆశలు చిగురించిన వైజాగ్‌ మెట్రో కథ మళ్లీ మొదటికి చేరింది.

మరోసారి డీపీఆర్‌లో మార్పులకు..!

విశాఖ మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కకుండా ప్రభుత్వ ‘విజనరీ’ నిర్ణయాలు అడ్డుపడుతున్నాయి. గత ప్రభుత్వం పంపిన డీపీఆర్‌నే కొనసాగించి ఉంటే ఇప్పటికే పనులు ప్రారంభమయ్యేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం పట్టుబట్టి చేర్చిన 8 కి.మీ. డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌పై కేంద్ర మంత్రిత్వ శాఖలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీనివల్ల మెట్రోకు రావాల్సిన ట్రాఫిక్‌ దెబ్బతింటుందని కేంద్రం తేల్చిచెప్పింది.

అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం కనీసం 5 కిలోమీటర్ల మేరకై నా డబుల్‌ డెక్కర్‌ ఉంచాలని పట్టుబడుతోంది. దీనిపై గత 20 రోజులుగా కేంద్ర ప్రతినిధులతో కలిసి అధికారులు మళ్లీ సర్వే నిర్వహిస్తున్నారు. ఫలితంగా మూడోసారి డీపీఆర్‌లో మార్పులు తప్పనిసరయ్యాయి. ఈ జాప్యం వల్ల వైజాగ్‌ మెట్రో ప్రాజెక్టు మరోసారి అటకెక్కినట్లయింది.

‘బాబు’ విజనరీని ఛీకొట్టిన కేంద్రం

డబుల్‌ డెక్కర్‌తో ‘డబుల్‌’ భారం

విశాఖ మెట్రో ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు ఆర్థికంగా, సాంకేతికంగా పెను సవాలుగా మారాయి. గత ప్రభుత్వం 76 కి.మీ మేర రూపొందించిన డీపీఆర్‌ కంటే.. ప్రస్తుత ‘డబుల్‌ డెక్కర్‌’ ప్రతిపాదన వల్ల నిర్మాణ వ్యయం కిలోమీటరుకు 30 నుంచి 40 శాతం అదనంగా పెరిగింది. ఈ భారీ బడ్జెట్‌ను భరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సైతం నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎన్‌ఏడీ జంక్షన్‌ వంటి రద్దీ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న ఫ్లైఓవర్ల మధ్య మళ్లీ డబుల్‌ డెక్కర్‌ నిర్మించడం అత్యంత క్లిష్టమని పేర్కొంది. పైపులైన్లు, విద్యుత్‌ లైన్ల మార్పిడి వల్ల కాలయాపన జరగడమే కాకుండా, మలుపుల వద్ద మెట్రో వేగం తగ్గి ప్రయాణ సమయం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ మొండి పట్టుదల వల్ల వైజాగ్‌ మెట్రో పట్టాలెక్కడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement