కోతలు.. సాంకేతిక తిప్పలు | - | Sakshi
Sakshi News home page

కోతలు.. సాంకేతిక తిప్పలు

Jun 26 2025 6:55 AM | Updated on Jun 26 2025 6:55 AM

కోతలు

కోతలు.. సాంకేతిక తిప్పలు

తరగపువలస: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న తీరుకు పొంతన లేకుండా పోయింది. ‘తల్లికి వందనం’పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ రూ.15,000 చొప్పున ఇస్తామన్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు నిబంధనల పేరుతో లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తోంది. మాట నిలబెట్టుకోకపోగా.. సాంకేతిక లోపాల పేరుతో అర్హులకు సైతం అన్యాయం చేస్తూ తల్లుల ఆశలపై నీళ్లు చల్లుతోంది.

‘ఎవ్వరికీ ఎగ్గొట్టం’అన్నారు.. ఇప్పుడేమో.?

‘మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం’అని ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. ‘నిబంధనల సాకుతో ఎవరికీ ఎగ్గొట్టం’అంటూ నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. ఈ మాటలు నమ్మిన తల్లులకు ఇప్పుడు ఎదురవుతున్నవి కోతలు, కష్టాలే.

తొలి ఏడాది గుండు సున్నా.!

అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం మాట మార్చింది. తొలి ఏడాది పథకాన్ని అమలు చేయకుండా ఎగ్గొట్టేసింది. ఎట్టకేలకు ఈ ఏడాది తల్లికి వందనం అమలు చేయగా.. అనేక నిబంధనలు విధించి తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. హామీ ఇచ్చిన పూర్తి మొత్తం అందకపోవడం, సాంకేతిక సమస్యలతో అర్హుల జాబితా నుంచి పేర్లు గల్లంతవ్వడం వంటి ఘటనలతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ సిత్రాలు ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయి.

కోతలతో జమ

జీవీఎంసీ భీమిలి జోన్‌ ఒకటోవార్డు సంతపేటలో తెలుగు రామలక్ష్మి, మద్దిల చిట్టితల్లి, అడివరపు పుష్పలత అనే మహిళల ఖాతాలకు రూ.13 వేలకు బదులుగా రూ.10,900 వంతున జమ అయ్యాయి. ఒక్కొక్కరికి రూ.2,100 కోత విధించడంపై బాధితులు ప్రశ్నిస్తే.. ‘ఎంత పడితే అంతే’అంటూ సచివాలయ సిబ్బంది, బ్యాంకర్లు సమాధానమిస్తున్నారు. ఇచ్చిన హామీకి, జమ అవుతున్న మొత్తానికి పొంతన లేకపోవడంపై తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆధార్‌ అనుసంధానంతో అనర్హత

సంతపేటకు చెందిన బోని ఈశ్వర్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రేష్ట 2వ తరగతి, సాత్విక 5వ తరగతి చదువుతున్నారు. ఆయన ఆధార్‌ నంబర్‌కు అదనంగా వేర్వేరు ఇంటి పేర్లు కలిగిన అయిదుగురు ఈశ్వర్‌ పేర్లు లింక్‌ అయ్యాయి.. దీంతో ఆయన విద్యుత్‌ వాడకం నెలకు 150 యూనిట్లు దాటకపోయినా, రికార్డుల్లో 900 యూనిట్లుగా చూపిస్తోంది. ఈ సాంకేతిక తప్పిదం కారణంగా ఆయన పిల్లలకు పథకం అందలేదు. వారం రోజులుగా ఈయన విద్యుత్‌ కార్యాలయం, సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా డీలింక్‌ కావడం లేదు. అలాగే, ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ గుమ్మడివానిపాలెం గ్రామానికి చెందిన బొత్స రాము, అతని భార్య లక్ష్మి ఆధార్‌ నంబర్లకు ఏపీఈపీడీసీఎల్‌కు బదులు చిత్తూరు జిల్లా పరిధిలోని ఏపీఎస్‌పీడీసీఎల్‌కు సంబంధించిన బిల్లులు అనుసంధానం అయిపోయాయి. దీంతో విద్యుత్‌ బిల్లు రూ.2 వేలు దాటిందని చూపి, ఇంటర్‌ చదువుతున్న కుమారుడికి పథకం వర్తించలేదు. దీంతో బాధితులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఒకవైపు సాంకేతిక లోపాలను సరిదిద్దడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతుంటే.. మరోవైపు ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో నిలబెట్టుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నాటి మాటలకు, నేటి చేతలకు పొంతన లేదని, ‘తల్లికి వందనం’పథకం తల్లులకు ఆనందం బదులు ఆవేదననే మిగులుస్తోందని బాధితులు వాపోతున్నారు.

‘తల్లికి వందనం’లో సిత్రాలివీ..

కోతలు.. సాంకేతిక తిప్పలు1
1/1

కోతలు.. సాంకేతిక తిప్పలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement