
గప్చుప్గా ప్రజాభిప్రాయ సేకరణ
● అనుమతులు లేకపోయినా దర్జాగా కొండ తవ్వకాలు ● ఇప్పటికే మూడు కిలోమీటర్ల మేర అక్రమంగా రోడ్డు నిర్మాణం ● ఫిర్యాదులు చేసినా పట్టించుకోని తహసీల్దార్
అనకాపల్లి టౌన్: నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ఓ కొండ తవ్వకాలతో పాటు రోడ్డు నిర్మాణంపై ఫిర్యాదుల మేరకు అధికారులు గుట్టుచప్పుడుగా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీస సమాచారం లేకుండా తూతూ మంత్రంగా సమావేశం నిర్వహించి నివేదిక తయారు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని బవులవాడ పంచాయతీ రావు గోపాలరావు కాలనీలో సర్వే నంబర్లు 70, 74, 75లలో ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కొండను తవ్వి సమీపంలో ఉన్న క్వారీలకు లారీలు వెళ్లేందుకు వీలుగా దర్జాగా రోడ్డును నిర్మించారు. దీంతో కొంత మంది గ్రామస్తులు ఈ విషయంపై కలెక్టర్, తహసీల్దార్కు ఫిర్యాదులు చేశారు. అయినా మూడు కిలోమీటర్ల మేర అక్రమంగా రోడ్డు నిర్మాణ పనులు కొనసాగించారు. పలు ఫిర్యాదుల మేరకు ఎట్టకేలకు కొద్ది రోజుల క్రితం రోడ్డు పనులను తహసీల్దార్ రూరల్ ఎస్ఐల సహాయంతో ఆపించారు. అప్పటి నుంచి ఎలాగైనా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని భావించిన మైనింగ్ మాఫియా విశ్వ ప్రయత్నాలు చేసింది. అందుకు అధికారుల సహకారం తీసుకున్నారు. దీంతో ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా గప్చుప్గా తహసీల్దార్ విజయ్కుమార్, మైన్స్ ఏజీ కె.పురుషోత్తమ నాయుడు, రూరల్ ఎస్ఐ రవికుమార్, తదితర అధికారులతో కాలనీలోని రామాలయంలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. వాస్తవానికి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలంటే గ్రామంలో దండోరా వేయాలి. పత్రికా ప్రకటనలు ఇవ్వాలి. బహిరంగ ప్రదేశంలోనే సమావేశం నిర్వహించాలి. కానీ ఇవేమీ పాటించకుండానే తూతూ మంత్రంగా కానిచ్చేశారు. ఈ సమావేశంలో పలువురు ఈ రోడ్డు నిర్మాణం వల్ల బండరాళ్ళు తమ ఇళ్లపై పడిపోతాయని, జరగరానిది ఏమైనా జరిగితే ఏవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. మరికొంత మంది గ్రామంలో అక్రమ మైనింగ్ వల్ల ఇప్పటికే కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నామని వాపోయారు. అయితే ప్రలోభాలకు గురైన కొంత మంది అమాయకులు ఈ రోడ్డు ఏర్పాటుతో తమకు ఉపాధి లభిస్తుందన్నారు. ఈ క్రమంలో ఒకానొక దశలో గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఉపాధి ఎర చూపి..
రావు గోపాలరావు కాలనీలో ప్రజలంతా రెక్కాడితే గానీ డొక్కాడని వారు. అత్యధికులు దినసరి కార్మికులు, పేదలు. చిన్నపాటి ప్రలోభాలకు లొంగిపోతారని తెలుసుకున్న మైన్స్ మాఫియా బాబులు కొంత మందికి రూ.1500 చొప్పున పంపిణీ చేసి, ప్రజాభిప్రాయ సేకరణలో తమకు అనుకూలంగా మాట్లాడేలా చేసుకున్నారు. గ్రామ స్థాయి నాయకులకు అడిగినంత ముట్టజెప్పినట్లు సమాచారం. ఇలా ప్రభుత్వ ఆస్తులను ధారాదత్తం చేయడానికి మీకే అధికారాలు ఉన్నాయని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. దీనిపై తహసీల్దార్ విజయకుమార్ను సంప్రదించగా.. కాలనీలో 25 మంది అభిప్రాయాలు సేకరించామన్నారు. నివేదికను జిల్లా కలెక్టర్కు పంపిస్తామని చెప్పారు. కొండపై అనధికారికంగా రోడ్డు కోసం తవ్వితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రూరల్ పోలీసులను కోరినట్టు వివరించారు.

గప్చుప్గా ప్రజాభిప్రాయ సేకరణ