
చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడు అరెస్ట్
కశింకోట: మండలంలోని కొత్త అచ్చెర్ల గ్రామంలో చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడ్ని అరెస్టు చేశారు. ఈ మేరకు డీఎస్పీ ఎం.శ్రావణి విలేకరులకు బుధవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు. కొత్త అచ్చెర్ల గ్రామంలో ఈ నెల 16న తన ఇంటి వద్ద నిమ్మదల ధనలక్ష్మి గడ్డి కోస్తోంది. పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన శీలం కార్తీక్(24) బైక్తో ఆమె వద్దకు వచ్చి ఆగాడు. రాజాం గ్రామానికి దారెటు అని మాటలు కలిపాడు. బైకును ఆన్లోనే ఉంచాడు. ధనలక్ష్మి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును గుర్తించాడు. వెంటనే వాటిని తెంచుకుని పరారయ్యాడు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ అల్లు స్వామినాయుడు పర్యవేక్షణలో ఎస్ఐలు కె.లక్ష్మణరావు, పి.మనోజ్కుమార్, కానిస్టేబుళ్లు డి.మహేష్, గోపీ, శ్రీనివాస్, మూర్తిలతో కూడిన బృందం నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజీలు, నిఘా సమాచారంతో ఎట్టకేలకు నిందితుడ్ని గుర్తించారు. దొంగిలించిన బంగారు పుస్తలతాడును విక్రయించేందుకు బయ్యవరం వద్ద విశాఖకు వెళుతుండగా పోలీసులు అరెస్టు చేసి, చోరీ సొత్తును, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ప్రైవేటు ఉద్యోగం మానేసి బెట్టింగ్ వ్యసనంతో అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో నగదు కోసం చోరీలకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని డీఎస్పీ శ్రావణి తెలిపారు. అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన సీఐ స్వామినాయుడు, ఎస్ఐ లక్ష్మణరావు, మనోజ్కుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.