
కలెక్టరేట్లో బసవేశ్వరుని జయంతి వేడుక
తుమ్మపాల : లింగాయత్ సంప్రదాయాన్ని రూపొందించడంలో బసవేశ్వరుడు కీలక పాత్ర పోషించారని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. బసవేశ్వరుని జయంతి పురస్కరించుకుని కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకలో బసవేశ్వరుని చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లింగ వివక్షను వ్యతిరేకించిన అభ్యుదయవాది బసవేశ్వరుడని అన్నారు. అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం భావాలలో విప్లవాత్మక మార్పులు రావడానికి పరోక్షంగా బసవేశ్వరుడు కారణమని తెలిపారు. పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైందన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఇంచార్జి ఏవో వాసునాయుడు, కలెక్టరేట్ సెక్షన్ల సూపరిండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.