
మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
సీతంపేట (విశాఖ): భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతిపౌరుడు తెలుసుకోవాలని మానవ హక్కుల కౌన్సిల్ కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ అన్నారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో శనివారం నిర్వహించిన కౌన్సిల్ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం మనకు ప్రసాదించిన సమానత్వపు హక్కులను కాపాడాల్సిన బాధ్యత హ్యూమన్రైట్స్ డిఫెండర్లపై ఉందన్నారు. సీనియర్ న్యాయవాది, కౌన్సిల్ సభ్యుడు ఎన్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చట్టం ద్వారా మనకు కల్పించబడిన స్వేచ్ఛ, బాధ్యతలు అంటే సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యతగా పేర్కొన్నారు. మాజీ పోలీస్ అధికారి సీహెచ్ సత్యనారాయణ మాట్లాడుతూ పౌరులందరికీ సమానత్వపు హక్కు, స్వేచ్ఛా హక్కు, దోపిడీ నుంచి రక్షణ, మత స్వేచ్ఛ, విద్యా హక్కు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.వి.రమణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ మతం, భాష సంస్కృతి కాపాడుకునే హక్కు ఉందన్నారు. ఈ సమావేశంలో సీనియర్ సభ్యులు గుండు అప్పలరాజు, మాజీ పోలీస్ అధికారులు, న్యాయవాదులు పాల్గొని మానవహక్కుల కౌన్సిల్ 26 ఏళ్లుగా చేస్తున్న సేవలను ప్రశంసించారు.